తెలంగాణ శాసనసభ రద్దుకు అంతా సిద్దం..! అదికారిక ప్రకటనే తరవాయి..!!
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఖరారయ్యింది. గురువారం నాడు తెలంగాణ తొలి అసెంబ్లీ అనూహ్యంగా రద్దు కానుంది. మంగళవారం నాడు ఈ దిశగా పలు పరిణామాలు శరవేగంగా సాగాయి. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఏకదాటిగా భేటీలు, సమావేశాలు, చర్చలు జరిపారు. చివరగా సెప్టెంబర్ 6న మంత్రివర్గం సమావేశమై అసెంబ్లీ రద్దుకు నిర్ణయం తీసుకోనుంది. దీంతో తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధం కానుంది. ముఖ్యమంత్రి కెసీఆర్ కు నమ్మకాలు ఎక్కువ. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ జాతకం ప్రకారం గురువారం ఉదయం 6 గంటల నుంచి 7 వరకు కీలక నిర్ణయాలకు అత్యంత అనుకూల సమయమని తెలుస్తోంది.
ముందస్తుకు వెళ్లాల్సిందే..! ఇదే నామాట..! నామాటే శాసనం అంటున్న కేసీఆర్..!!
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు వచ్చిన రాజకీయ అస్థిరత ఏమీ లేదు. పాలన కూడా అంతా సాఫీగానే సాగుతుంది. నిత్యం ఎన్నికలు అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని..వన్ నేషన్..వన్ ఎలక్షన్ ఎన్నికలపై చర్చ లేవనెత్తిన ప్రధాని మోడీ, బిజెపి లు ఎందుకు తెలంగాణ ముందస్తుకు మద్దతు తెలుపుతున్నాయి?. అసెంబ్లీ రద్దుతో నవంబర్ లేదా డిసెంబర్ లో ఎన్నికలు జరుగుతాయి అనుకుందాం?. మళ్ళీ మూడు..నాలుగు నెలల్లో అంటే..మార్చి..ఏప్రిల్ లో ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయి కదా?. విడివిడి ఎన్నికలతో అదనపు ఖర్చుతోపాటు..అభివృద్ధి ఆగిపోతుందని తెలిసి కూడా జమిలి ఎన్నికలకు జైకొట్టిన మోడీ, కెసీఆర్ లు ఎందుకు ముందుకు సాగుతున్నారు?.
శాసన సభ రద్దుపై విడతల వారీ చర్చలు..! కేసీఆర్ ఆపధ్దర్మ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు వ్యూహాలు..!!
ఆయన నక్షత్ర, రాశులకు అనుకూలంగా గ్రహస్థితులు ఆ రోజు ఉన్నాయని, అందుకే ఆ సమయాన కేబినెట్ భేటీకి సీఎం సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు మంగళవారం మధ్యాహ్నం గవర్నర్ నరసింహన్తో సమావేశం కాగా, ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో భేటీ అయ్యారు. గురువారం శాసనసభ రద్దు ప్రకటన చేయటంతోపాటు, శుక్రవారం కెసీఆర్ హుస్నాబాద్ బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఆ సభలోనే తెలంగాణ తొలి అభ్యర్థుల జాబితాను కూడా కేసీఆర్ ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది.
అంతా జాతకబలం ప్రకారమే..! ముందస్తుకు వెళ్లాల్సిందే..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ అసలు రాష్ట్ర ప్రజలపై ముందస్తు ఎన్నికలు ఎందుకు రుద్దుతున్నారో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. 2018లో ఎన్నికలు పూర్తయితేనే మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తుందనే జ్యోతిష్యులు చెప్పిన మాటలే కారణమా?.లేక ఏమైనా హేతుబద్దమైన కారణాలు ఉన్నాయా? చంద్రశేఖర్ రావు జాతకమే మొత్తం తెలంగాణ ప్రజల జాతకంగా భావించాలా? చివరకు అసెంబ్లీ రద్దు కూడా ముహుర్త బలాలు..జాతకాల ప్రకారమే చేస్తారా? మూఢనమ్మకాలకు సంబంధించి ప్రజలకు ప్రభుత్వం ఎలాంటి సందేశాలు ఇస్తోంది. జమిలి ఎన్నికలు పెట్టడం లేదు కాబట్టి విడిగా అసెంబ్లీకి వెళతామంటే ఓకే అంటారా? దీనికి సహేతుకమైన కారణాలు ఏమీ చెప్పకపోవడం గమనార్హం.
ఇక తెలంగాణ వ్యాప్తంగా సుడిగాలి పర్యటన..! 50రోజులు..100సమావేశాలు..!!
అధికార టీఆర్ఎస్ పార్టీలో వరస పెట్టి బహిరంగ సభలకు రెడీ అవుతోంది. అందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ లో ఈ నెల7న బహిరంగ సభ నిర్వహించనుంది. మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావులు మంగళవారం నాడు బహిరంగ సభ పనులు ప్రారంభించారు. ప్రజల ఆశీర్వాద సభ పేరుతో దీన్ని నిర్వహించనున్నారు. అసెంబ్లీ రద్దు అయిన మరుసటి రోజే బహిరంగ సభకు శ్రీకారం చుట్టడం ద్వారా కెసీఆర్ ప్రజలకు ఇలాంటి సందేశం ఇవ్వనున్నారనే అంశంపై ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు 50 రోజుల్లో వంద నియోజకవర్గాల్లో పర్యటించటం ద్వారా పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయనున్నారు. ఈ నెల6న అసెంబ్లీ రద్దుకు కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తోంది.