కరోనా వ్యాక్సిన్ ధరల రగడ : జిఎస్టీ విధానంతో లింక్ , కేంద్రాన్ని లాజిక్ తో కొట్టిన మంత్రి కేటీఆర్ !!
కరోనా నివారణా వ్యాక్సిన్ కోవిషీల్డ్ ధరను కేంద్ర ప్రభుత్వానికి 150 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వాలకు నాలుగు వందల రూపాయలు, ప్రైవేట్ ఆసుపత్రులకు 600 రూపాయలుగా నిర్ణయించటంపై నిన్నటి నుండి రగడ కొనసాగుతుంది . సీరం సంస్థ కోవిషీల్డ్ ధరలను వెల్లడించిన తర్వాత విపక్షాలు భగ్గుమన్నాయి. సామాన్యులకు అందుబాటులో ఉండకుండా , రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం పడేలా ధరలను నిర్ణయించటాన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.
వ్యాక్సిన్ ధరల వ్యత్యాసంపై కేంద్రాన్ని టార్గెట్ చేసిన కేటీఆర్
తాజాగా తెలంగాణా ఐటీ , పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు .దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ ల ధరల వ్యత్యాసం పై ట్వీట్ చేసిన కేటీఆర్ కేంద్రానికి పలు ప్రశ్నలను సంధించారు. ఒకే దేశం ఒకే పన్ను విధానం అంటే జీఎస్టీ ని అంగీకరించాం పేర్కొన్న కేటీఆర్ కానీ ఒకే దేశంలో 2 భిన్నమైన వ్యాక్సిన్ ధరలను మనం చూస్తున్నామని , ఇది ఎక్కడ విధానమని కేంద్రాన్ని ప్రశ్నించారు.

వ్యాక్సిన్ కొనుగోలు అదనపు ఖర్చుని కేంద్రం పీఎం కేర్స్ నిధి నుంచి భరించలేదా ?
కేంద్ర ప్రభుత్వానికి 150 రూపాయలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు నాలుగు వందల రూపాయలకు వ్యాక్సిన్ ఇస్తామని పేర్కొన్న ప్రకటనను ప్రస్తావించిన కేటీఆర్ అదనపు ఖర్చుని కేంద్రం పీఎం కేర్స్ నిధి నుంచి భరించలేదా? దేశమంతా వ్యాక్సినేషన్ పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించలేదా ? సబ్ కా సాత్ సబ్ కా వ్యాక్సిన్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూనే ప్రశ్నల వర్షం కురిపించారు .
రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆసుపత్రులకు కోవిషీల్డ్ ధరలను 400 రూపాయలు , ఆరు వందల రూపాయలుగా నిన్న సీరం సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే . అందుకే ఈ ప్రకటన నేపధ్యంలో కేంద్రాన్ని కేటీఆర్ టార్గెట్ చేశారు .

వ్యాక్సిన్ ధరల నిర్ణయంపై దేశ వ్యాప్తంగా విమర్శలు
కేంద్రానికి 150 రూపాయలకే వ్యాక్సిన్ డోసులు ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం 400 రూపాయలు గా, ఇక ప్రైవేటు ఆసుపత్రులకు 600 రూపాయలు గా బాక్సింగ్ ధరలను నిర్ణయించడాన్ని పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా తప్పు పడుతున్నాయి. నిన్న సీరం సంస్థ ప్రకటన చేసినప్పటి నుండి కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్ వ్యూహాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు.
కరోనా వ్యాక్సిన్ సామాన్యులకు కూడా అందుబాటులో వుండాలని, కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చేలా వ్యాక్సిన్ ధరల నిర్ణయం ఉందని ఇప్పటికే కాంగ్రెస్ తో పాటు, వామపక్ష పార్టీలు మండిపడ్డాయి .

వ్యాక్సిన్ ధరల వ్యత్యాసంపై నిన్నటి నుండి షాకింగ్ ట్వీట్స్ .. వెల్లువగా వ్యతిరేకత
నిన్నటికి నిన్న రాహుల్ గాంధీ , ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్నేహితులకు ఇది గొప్ప అవకాశం అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కొద్దిమంది పారిశ్రామికవేత్తలకు మాత్రమే ప్రయోజనం కలిగించేలా ఈ నిర్ణయం ఉందని కేంద్రం తీరు పై నిప్పులు చెరిగారు. సిపిఎం జనరల్ సెక్రెటరీ సీతారాం ఏచూరి సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ లో వ్యాక్సిన్ లను పారదర్శకంగా, న్యాయబద్ధమైన విధానంలో పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఇక మరెప్పుడైనా బిజినెస్ చేద్దాం ఇప్పుడు కాదన్నారు సోనూ సూద్ .












Click it and Unblock the Notifications