బీజేపీలోకి రాజాసింగ్ రీఎంట్రీ ? రూట్ చెప్పిన ధర్మపురి అరవింద్..!
బీజేపీ అధిష్టానం వైఖరిపై అలిగి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసిన గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తిరిగి ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా ? పార్టీ నుంచి తనంతట తానే వెళ్లిపోయిన రాజా సింగ్ విషయంలో బీజేపీలోని పలువురు నేతలకు సానుభూతి ఉందా ? అదే ఇప్పుడు ఆయన రీఎంట్రీకి మార్గం సుగమం చేస్తుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ వాదనlకు మద్దతుగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇవాళ రాజా సింగ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి రామచంద్రరావును ఎంపిక చేయడంపై తీవ్ర అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేసిన గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆ తర్వాత పార్టీ కోరితే ఎమ్మెల్యే పదవి కూడా వదులుకుంటానని ప్రకటించారు. దీంతో ఓ దశలో గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన మాధవీలత సైతం రేసులోకి వచ్చేశారు. ఈ నేపథ్యంలో రాజా సింగ్ ఎమ్మెల్యే పదవి విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఆయన రీఎంట్రీపై ఊహాగానాలు మొదలయ్యాయి.

ఈ నేపథ్యంలో ఇవాళ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింగ్ రాజా సింగ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజా భాయ్ ఎక్కడున్నా గౌరవిస్తామంటూ ధర్మపురి అరవింద్ తెలిపారు. బీజేపీ నుంచి ఆయన సస్పెండ్ కాలేదని, కేవలం రాజీనామా మాత్రమే చేశారని గుర్తుచేశారు. అక్కడితో ఆగకుండా తిరిగి ఆయన బీజేపీలోకి రావచ్చంటూ వ్యాఖ్యానించారు. కొన్ని విషయాల్లో మనస్తాపం చెంది రాజాభాయ్ రాజీనామా చేశారని చెప్పుకొచ్చారు.
అలాగే రాజా సింగ్ రాజకీయాల కంటే సిద్ధాంతాలు ఉన్న వ్యక్తి అని ధర్మపురి అరవింద్ తెలిపారు. ఆయన పార్టీలోకి తిరిగి వచ్చేందుకు అవకాశం ఉందని తెలిపారు. త్వరలో పార్టీ సభ్యత్వ డ్రైవ్ ఉంటుందని, అందులో మిస్డ్ కాల్ ఇస్తే చాలు తిరిగి పార్టీలోకి రావొచ్చంటూ రాాజా సింగ్ కు ఆయన ఆఫర్ కూడా ఇచ్చేశారు. దీంతో ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాజా సింగ్ ను తిరిగి పార్టీలోకి రప్పించేందుకు బీజేపీలో ఓ వర్గం గట్టిగా ప్రయత్నిస్తోందన్న చర్చ నేపథ్యంలో అరవింద్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.












Click it and Unblock the Notifications