వన్ స్టేట్ - వన్ పోలీస్.. రోడ్డెక్కిన పోలీసుల భార్యలు.. ఎందుకంటే!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కార్యక్రమాలు జరుగుతున్న వేళ తెలంగాణ రాష్ట్రంలోని పోలీస్ కుటుంబాలు రోడ్డు ఎక్కటం, వన్ స్టేట్ వన్ పోలీస్ నినాదాలతో హోరెత్తించడం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. సమాజంలో శాంతిభద్రతలను పరిరక్షిస్తూ, ప్రజల జీవితాలకు, ఆస్తులకు రక్షణ కల్పిస్తున్న పోలీసుల సమస్యలపై పోలీసుల కుటుంబాలు రోడ్డు ఎక్కడంతో చర్చనీయాంశం అయ్యాయి.
పోలీస్ కుటుంబాల ఆందోళనలు
రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలు కాపాడే పోలీస్ వ్యవస్థలోను ఒకే పోలీస్ విధానాన్ని అమలు చేయాలని రిజర్వుడు పోలీసులకు ప్రత్యేక నిబంధనలు సరికాదంటూ పెద్ద సంఖ్యలో బెటాలియన్ల కానిస్టేబుల్ ల కుటుంబ సభ్యులు ఆందోళనలు చేయడం తో అసలేం జరుగుతుంది అన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. మొన్నటికి మొన్న వరంగల్ మామునూరు నాలుగో బెటాలియన్ పోలీసుల భార్యలు రోడ్డెక్కి ధర్నా చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా బెటాలియన్ లలో పని చేసే పోలీస్ కుటుంబాల ధర్నా
ఇక తాజాగా నల్లగొండ జిల్లాలో 12 వ బెటాలియన్ లో పోలీసుల కుటుంబాలు ఆందోళన నిర్వహించాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో 17వ బెటాలియన్ పోలీసుల భార్యలు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని డిచ్ పల్లి ఏడవ బెటాలియన్ వద్ద కూడా పోలీసుల భార్యలు ధర్నా చేశారు.
వన్ స్టేట్ వన్ పోలీస్ విధానం అమలుకు డిమాండ్
వారు ఆదిలాబాద్ పోరుబాటకు వెళ్తున్న మాజీ మంత్రి కేటీఆర్ ను అడ్డుకున్నారు. వారితో మాట్లాడిన కేటీఆర్ అసెంబ్లీలో వారి సమస్యలను లేవనెత్తుతామని హామీ ఇచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న పోలీస్ కుటుంబాలు రాష్ట్రమంతా ఒకే పోలీస్ విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
రిజర్వ్డ్ పోలీసులు కూలీల కంటే ఘోరమా
రిజర్వ్డ్ పోలీసులను కూలీల కంటే దారుణంగా చూస్తున్నారని, సెలవులు ఇవ్వకుండా కుటుంబాలకు దూరంగా విధులు వేస్తున్నారని పోలీస్ కానిస్టేబుల్స్ కుటుంబాలు ఆరోపిస్తున్నారు. కానిస్టేబుళ్లను వెట్టిసాకిరి చేయిస్తూ కుటుంబానికి దూరం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలకు తండ్రి ప్రేమ దూరం చేస్తున్నారని మండిపడుతున్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి
రిజర్వ్డ్ పోలీసుల బాధలను అర్థం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి పోలీసుల భార్యలు విజ్ఞప్తి చేస్తున్నారు. మిగతా పోలీసుల మాదిరిగా తమ వారికి ఎందుకు విధులు కేటాయించకూడదని ప్రశ్నిస్తున్నారు. గతంలో 10 రోజులకు ఒకసారి ఇళ్ళకు వచ్చేవారని, ఇప్పుడు 20 రోజులు అయినా ఇళ్ళకు రావటం లేదని, వచ్చినా అర్దరాత్రి కాల్ వచ్చినా వెళ్ళిపోవాలని, మాకు వ్యక్తిగత జీవితం లేదా అని ప్రశ్నిస్తున్నారు.
ఒత్తిడి తెచ్చినా సరే ఆందోళనలు విరమించం అంటున్న పోలీసుల భార్యలు
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో ఉన్న పోలీస్ విధానాన్ని ఇక్కడ కూడా అమలు చెయ్యాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న పోలీస్ కుటుంబాల కారణంగా తమ వారిపై ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తున్నారని, అయినా సరే ఆందోళనలు విరమించేది లేదని పోలీసుల భార్యలు తేల్చి చెప్తున్నారు.












Click it and Unblock the Notifications