ఉస్మానియాలో రాళ్ల వర్షం, అరుణ వ్యాఖ్యపై సునీత..
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగ నియామకాల ప్రకటన వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయ ఐక్య కార్యాచరణ సమితి ఛలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టింది. ఇది ఉద్రిక్తతకు దారి తీసింది. ఆర్ట్స్ కళాశాల నుండి విద్యార్థులు ర్యాలీగా బయలుదేరారు.
పోలీసులు వారిని ఎన్సీసీ గేటు వద్ద అడ్డుకున్నారు. విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో విద్యార్థులు పరుగులు తీశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది.

తెలంగాణ శాసన సభలో మద్యం సిండికేట్ రగడ
తనపై వచ్చిన అవినీతి ఆరోపణల కేసులు కోర్టు విచారణలో ఉన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ శాసన సభలో అన్నారు. దీనిపై తెలంగాణ నేతలు అసెంబ్లీలో మాట్లాడటం విచారకరమన్నారు. స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ప్రభుత్వానికి అనుకూంగా వ్యవహరించకూడదని ఆమె సూచించారు. అసెంబ్లీకి మద్యం సిండికేటును తీసుకు వచ్చారని ఆరోపించారు.
డీకే అరుణ ఆరోపణల పైన ప్రభుత్వ విప్ గొంగిడి సునీత స్పందించారు. తాను పీఆర్వోని నియమించుకున్నానని, అతను మద్యం వ్యాపారి కాదని ఆమె తెలిపారు. తన పై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, అవసరమైతే సీసీ ఫుటేజీలు పరిశీలించవచ్చన్నారు.
డీకే అరుణ కుటుంబంపై అక్రమ మైనింగ్ ఆరోపలు పత్రికల్లో వచ్చాయని ఆరోపిస్తూ సునీత వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్ నాయకులు స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేపట్టారు. దీనిపై స్పందించిన స్పీకర్.. రికార్డులను పరిశీలించి తొలగిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications