చంద్రబాబుకు ఊహించని షాక్?: టీఆర్ఎస్లోకి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు
హైదరాబాద్: తెలంగాణలో టీడీపీకి ఊహించని షాక్ తగలనుందా? అంటే అవుననే అంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి షాక్ ఇస్తూ.... తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్ రమణ టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లనున్నారంటూ మీడియాలో వస్తున్న వార్తలు సంచలనాన్ని కలిగిస్తున్నాయి.
గడిచిన ఎన్నికల్లో టీడీపీ నుంచి మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు గెలవగా అందులో 12 మంది ఇప్పటికే టీఆర్ఎస్లో చేరారు. తాజాగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా టీఆర్ఎస్లో చేరనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను ఆయన ఖండించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా తెలంగాణలో విపక్షాలు లేకుండా చేసేలా ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రజలు తెలుగుదేశం పార్టీని మరిచిపోయారనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ క్రమంలో టీడీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదన్న భయంతోనే ఎల్ రమణ, సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులతో మంతనాలు జరిపినట్టు సమాచారం.

గతేడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీ వ్యవహారాలను పూర్తిగా పట్టించుకోవడం మానివేశారు. అంతేకాదు పార్టీని ఫిరాయించే వారిని నిలువరించే ప్రయత్నాలు కూడా చేయలేదని ఎల్ రమణ ఎంతో ఆవేదన చెందినట్లు సమాచారం.
ఇక ఇదే పార్టీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు ఉండదని అర్ధం చేసుకున్న ఎల్ రమణ పార్టీ మారేందుకే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు రెండోసారి టీటీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ, రేవంత్ రెడ్డి తర్వాతనే తన స్థానమని భావనలో కూడా రమణ ఉన్నట్లు తెలుస్తోంది.
జగిత్యాల నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన ఎల్ రమణ కాంగ్రెస్కు చెందిన జీవన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేత కూడా ఓటమి పాలవ్వడం ఎల్ రమణకు కలిసొచ్చే అంశం. ఈ నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు ఎల్ రమణ ఉపయోగపడతారని భావిస్తున్న మంత్రి హరీశ్ స్వయంగా రమణను కలిసి లంచ్ మీటింగ్ పెట్టారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
తెలంగాణలో ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతర్ధానమైపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వరసులో టీడీపీ ఉంది. కాగా, ఏపీలో ఆకర్ష్ ద్వారా వైసీపీకీ చెందిన ఎమ్మెల్యేలను చంద్రబాబు టీడీపీలోకి ఆహ్వానించి జగన్కు నిద్ర పట్టుకుండా చేస్తుంటే.. తెలంగాణలో మాత్రంలో చంద్రబాబుకు చెమటలు పడుతున్నాయి.
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా చంద్రబాబు పార్టీని దెబ్బతీసేలా ఉండటం విశేషం.
నేను పార్టీ మారడం లేదు: ఎల్. రమణ
తెలుగుదేశం పార్టీని వీడుతున్నానంటూ మీడియాలో వచ్చిన వార్తలపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ స్పందించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.
తాను పార్టీ మారతామంటూ కొన్ని పత్రికలు తప్పుడు రాతలు రాస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనికట్టుకుని తమపై విష ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలో టీడీపీ పునర్నిర్మాణానికి తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నానని ఆయన ఉద్ఘాటించారు.
సీఎం కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తమ చిత్తశుద్ధిని బలహీనపరచలేరని రమణ అన్నారు. తాను పార్టీ మారుతున్నట్టు సాక్షి తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.












Click it and Unblock the Notifications