'తెలంగాణలో టిడిపి బీ టీం పాలన, ఇలా.. కేసీఆర్ కూడా ద్రోహి'
హైదరాబాద్: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బీ టీమ్ పాలన కొనసాగుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. నాడు కాంగ్రెస్ పార్టీ పలు సంక్షేమ పథకాలతో రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపితే నేడు తెరాస వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో నెట్టిందన్నారు.
జగిత్యాల జిల్లా సారంగాపూర్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు, కూలీల గర్జన సభలో శనివారం ఆయన మాట్లాడారు. కేసీఆర్ 1994 నుంచి 1999 వరకు నాటి ముఖ్యమంత్రి, తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబు హయాంలో ప్రభుత్వ సలహాదారుడిగా వ్యవహరించారన్నారు.
పోచారం శ్రీనివాస్రెడ్డి, కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు కూడా టిడిపి హయాంలో పదవులు అనుభవించారన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తెరాసలో నాటి తెలంగాణ ద్రోహులే మంత్రులుగా ఉన్నారని మండిపడ్డారు. తెలంగాణ ద్రోహులతో జట్టు కట్టినందున కేసీఆర్ కూడా తెలంగాణ ద్రోహే అన్నారు.
జర్నలిస్టుల సమస్యపై రేవంత్ రెడ్డి
జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతానని తెలంగాణ టిడిపి కార్యనిర్వాహాక అధ్యక్షులు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం భూపాలపల్లిలో జరిగే రైతు పోరుయాత్రకు వెళ్తూ మార్గమధ్యలోగల వరంగల్లో జర్నలిస్టులు నిర్వహిస్తున్న రిలే దీక్షలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడారు. 85మంది పాత్రికేయులు చనిపోయినా ప్రభుత్వం స్పందించట్లేదన్నారు.