బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రలో ఉద్రిక్తత: బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల బాహాబాహీ; భగ్గుమన్న బీజేపీ
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఐదో రోజుకు చేరుకుంది. అయితే నేడు బండి సంజయ్ పాదయాత్ర లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తన రెండో విడత పాదయాత్రను జోగులాంబ గద్వాల జిల్లా నుంచి ప్రారంభించిన బండి సంజయ్ గత నాలుగు రోజులుగా నిర్విఘ్నంగా పాదయాత్రను కొనసాగించారు. ఇక నేడు ఐదవ రోజున పాదయాత్ర సందర్భంగా పాదయాత్రను అడ్డుకునేందుకు టిఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించగా, టిఆర్ఎస్ కు, సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

ఇటిక్యాల మండలం వేముల గ్రామంలో బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత
ఇటిక్యాల మండలం వేముల గ్రామంలో పాదయాత్రను అడ్డుకోవడానికి టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించడంతో, వారిని అడ్డుకోవడం కోసం బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలతో ముందుకు వెళ్లారు. టిఆర్ఎస్ వర్సెస్ బిజెపి అన్నట్టుగా ప్రజా సంగ్రామ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో టీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించిన ఒక కారును బీజేపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. టిఆర్ఎస్ శ్రేణులు సంజయ్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేయగా, సీఎం కేసీఆర్ కు, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.

బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల బాహాబాహీ.. రంగంలోకి దిగిన పోలీసులు
ఇరు వర్గాలు బాహాబాహీకి దిగడంతో రెండు పార్టీల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఇక బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలను కొట్టడానికి దూసుకు వెళ్లడంతో, డీకే అరుణ కార్యకర్తలను శాంతింపజేశారు. బండి సంజయ్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన టిఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు నిలువరించారు. వారిని అక్కడి నుండి వేరే ప్రదేశానికి తరలించారు పోలీసులు. బండి సంజయ్ పాదయాత్రను టిఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడానికి ప్రయత్నించడం పై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నారు.

కేసీఆర్ సర్కార్ పై, సీఎం తీరుపై మండిపడిన బండి సంజయ్
ఇక ఈ ఘటనపై మాట్లాడిన బండి సంజయ్ టిఆర్ఎస్ నేతలు ఏ ప్రశ్న అడిగినా సమాధానాలు చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. టిఆర్ఎస్ నేతలు అడ్డగిస్తున్నా తాము స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. పాలమూరు ప్రజల సమస్యలను వెలికి తీస్తున్నామని చెప్పిన బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాయలసీమకు నీళ్లిచ్చి ఏపీకి పట్టం పడుతుందని తెలంగాణ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. సంగమేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు? చెప్పాలని డిమాండ్ చేశారు కేసీఆర్ మౌనం తెలంగాణకు తీరని ద్రోహం అని బండి సంజయ్ పేర్కొన్నారు.

కేసీఆర్ కూడా పాదయాత్ర చెయ్యాలని బండి సంజయ్ సూచన
కృష్ణా జలాల కేటాయింపులో ఇంత మోసం ఏపీ సమైక్య పాలనలో కూడా జరగలేదు అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి పాదయాత్రలు చేసే హక్కు ఉందని, ప్రశ్నించే హక్కు ఉందని బండి సంజయ్ వెల్లడించారు. తాము ప్రభుత్వ విధానాలను ప్రశ్నించటం వల్లే తమను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ బండి సంజయ్ ఆరోపణలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ కూడా పాదయాత్ర చేసిన బండి సంజయ్ కేసీఆర్ కు సలహా ఇచ్చారు.












Click it and Unblock the Notifications