భయం గుప్పిట్లో ఉమ్మడి ఆదిలాబాద్ ఏజెన్సీ ..మావోలు,పోలీసుల మధ్య నలిగిపోతున్న అమాయక గిరిజనం
తెలంగాణ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలలో మావోయిస్టుల కదలికల నేపధ్యంలో అలజడి మొదలైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలో ప్రస్తుతం భయానక వాతావరణం కొనసాగుతోంది. కడంబా, దేవర్లగూడ, పూసుగుప్ప, చర్ల ఎన్కౌంటర్లకు నిరసనగా మావోయిస్టులు నేడు బంద్ కు పిలుపునిచ్చిన కారణంగా ఏజెన్సీ ప్రాంతంలో భయాందోళన నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో ఏజెన్సీ వాసులు ఉన్నారు.
Police Alert: వాగు దాటుతూ డ్రోన్ కెమెరాలకు చిక్కిన మావోలు..ఇదిగో వీడియో..!
మావోయిస్టుల కోసం అటవీప్రాంతం జల్లెడ పడుతున్న పోలీసులు
నిన్నా మొన్నటి దాకా సైలెంట్ గా ఉన్న ఏజెన్సీ ప్రాంతాలు, ఒక్కసారిగా పోలీసులు తనిఖీలతో ఉలిక్కి పడుతున్నాయి. మావోయిస్టులు చాప కింద నీరులా తమ కార్యాకలాపాలు చేస్తున్నారని గుర్తించిన పోలీసులు అలెర్ట్ అయ్యారు. మావోయిస్టులు పెద్ద సంఖ్యలో తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యారన్న డ్రోన్ కెమెరా వీడియో సమాచారంతో అటవీ ప్రాంతం అంతా పోలీసులు జల్లెడ పడుతున్నారు. దొరికిన వారిని దొరికినట్లు ఎన్కౌంటర్ చేస్తున్నారు.
ఎన్ కౌంటర్ లకు నిరసనగా నేడు మావోల బంద్
ఇటీవల వరుసగా పోలీసులు చేస్తున్న ఎన్కౌంటర్లకు నిరసనగా మావోయిస్టులు నేడు బంద్ కు పిలుపునిచ్చారు. మావోల బంద్ నేపథ్యంలో కవ్వాల్, కడంబా, తిర్యాణి, పెంబి అటవీ ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలు, గిరిజనులు బిక్కుబిక్కుమంటున్నారు. అనుమానితులను, మావోయిస్ట్ సానుభూతిపరులను పోలీసులు పదేపదే ప్రశ్నిస్తూ ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు. కడంబ ఎన్కౌంటర్ కు ప్రతీకారం తీర్చుకుంటామని మావోయిస్టు పార్టీ జగన్ పేరుతో లేఖ విడుదల కావడంతో పోలీసులు అటవీ ప్రాంతంలో మరింత నిఘా పెంచారు.
కడంబా ఎన్ కౌంటర్ .. భయం గుప్పిట్లో ఏజెన్సీ
కుమురంభీం జిల్లా కాగజ్నగర్ మండలం కడంబా అడవుల్లో ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు . ఆసిఫాబాద్ పట్టణం సమీపంలోని చీలేటిగూడకు మంచిర్యాల, కుమురంభీం జిల్లాల డివిజన్ కమిటీ కార్యదర్శి మైలారపు అడెల్లు ఆలియాస్ భాస్కర్ వచ్చినట్లు అందిన సమాచారంతో పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. అయితే ఈ గాలింపులో ఇద్దరు మృతి చెందగా , భాస్కర్ తప్పించుకున్నాడు . దీంతో మహారాష్ట్ర వైపు వెళ్లే కాగజ్నగర్, పెంచికల్పేట్, బెజ్జూరు మండలాల్లోని అటవీ ప్రాంతాలను, రహదారులను ఎనిమిది ప్రత్యేక దళాలతో జల్లెడ పడుతున్నారు .
మావోలు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరిక
కడంబా ఎన్కౌంటర్ నుంచి తప్పించుకొన్న సభ్యుల కోసం పోలీసులు అడుగడుగున జల్లెడ పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు మావోయిస్టులు ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడతారని అనుమానిస్తున్నారు. నిఘా వర్గాలు కూడా ఈమేరకు హెచ్చరికలు జారీ చేశాయి. డ్రోన్ కెమెరా ల సహాయంతో సరిహద్దు ప్రాంతాలలో మావోయిస్టుల ఉనికిని కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.
Recommended Video
డ్రోన్ ల సహాయంతో అటవీ ప్రాంతం జల్లెడ
మావోయిస్టుల బంద్ నేపద్యంలో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, తెలంగాణ ఛత్తీస్ గడ్ సరిహద్దు ప్రాంతాలలో పోలీసుల పటిష్ట నిఘా కొనసాగుతోంది. మావోయిస్టుల బంద్ నేపధ్యంలో గ్రేహౌండ్స్ బలగాలు భారీగా మోహరించాయి. సరిహద్దు ప్రాంతాలలో తిరుగుతున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే వాహనాలను పంపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులు అలజడి సృష్టించే ప్రయత్నం చేయడానికి వచ్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. డ్రోన్ ల సహాయంతో కూడా అటవీ ప్రాంతాన్ని గాలిస్తున్నారు.