వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత: మీ దాడులకు అదిరేది లేదంటూ.. గులాబీనేతలకు షర్మిల సవాల్!!
వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇక పాదయాత్ర చేస్తున్న షర్మిల దూకుడుగా స్థానిక ఎమ్మెల్యేలపై, మంత్రులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ తీరును, సీఎం కేసీఆర్ పాలన వైఫల్యాలను తూర్పార పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా వైయస్ షర్మిల పాదయాత్ర లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
వైఎస్ షర్మిల ప్రసంగాన్ని అడ్డుకోవటానికి ప్రయత్నించిన టీఆర్ఎస్ కార్యకర్తలు.. ఉద్రిక్తత
పాదయాత్రలో భాగంగా పెద్దపల్లి జిల్లా లోని ధర్మారం మండలం లో కొత్తూరు కూడలిలో బహిరంగ సభ నిర్వహించిన షర్మిల ప్రసంగిస్తుండగా, కొంత మంది టిఆర్ఎస్ కార్యకర్తలు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైయస్ఆర్ తెలంగాణ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఏమాత్రం వెనుకంజ వేయని వైయస్ షర్మిల టిఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని టీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడి నుంచి పంపించి వేయడంతో వైయస్ షర్మిల పాదయాత్ర ముందుకు సాగింది.
వాళ్ళపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు షర్మిల డిమాండ్
అయితే తనపై దాడికి ప్రయత్నం చేసిన టిఆర్ఎస్ కార్యకర్తలు తీరుపై అసహనం వ్యక్తం చేసిన వైఎస్ షర్మిల పోలీసులు వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకోవాలని తాను పాదయాత్ర చేస్తుంటే, తనను టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అడ్డుకోవడం దారుణమని వైయస్ షర్మిల పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తీరును, టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే ఎదుర్కోలేక దాడులకు పాల్పడుతున్నారని వైయస్ షర్మిల ఆరోపించారు. దమ్ముంటే ప్రజా సమస్యలను పరిష్కరించాలని సవాల్ విసిరారు.
మీ దాడులకు అదిరేది లేదు.. బెదిరేది లేదన్న వైఎస్ షర్మిల
ఇక టిఆర్ఎస్ నాయకుల తీరు పై మండిపడిన వైయస్ షర్మిల మీ దాడులకు అదిరేది లేదు.. బెదిరేది లేదు ఆమె తేల్చి చెప్పారు. మీకు దమ్ముంటే అభివృద్ధి చేసి చూపించండి. ఇచ్చిన హామీలు నెరవేర్చండి. చేతకాని దద్దమ్మల్లా పోలీసులను పనోళ్లలా వాడుకుంటూ దుర్మార్గుల్లా వ్యవహరించడానికి సిగ్గుగా లేదా? అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్ ను టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల
ఇక ఇదే సమయంలో పాదయాత్రలో సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను టార్గెట్ చేసిన షర్మిల ప్రజల సంక్షేమాన్ని మరిచి సొంతం సంక్షేమం చూసుకుంటున్నాడు అంటూ మండిపడ్డారు. వరదలు వచ్చి గ్రామాలు కొట్టుకుపోయినా బయటికి వచ్చి, ఆదుకోలేదు అని విమర్శించారు. దళిత మంత్రైనా.. ఒక్క దళితుడికి మూడెకరాల భూమి ఇవ్వలేదు. ఈ సారి ఎన్నికలొస్తే కర్రుకాల్చి వాత పెట్టాలె అంటూ వైయస్ షర్మిల కొప్పుల ఈశ్వర్ ను విమర్శించారు.
కేసీఆర్ పైనా వైఎస్ షర్మిల ఆగ్రహం
కేసీఆర్ కు ఓట్లు కావాల్సినప్పుడే.. కావాల్సినన్ని మాటలు చెబుతాడని పేర్కొన్న షర్మిల, ఓట్లు పడ్డాక పత్తా లేకుండా పోతాడని మండిపడ్డారు. వరి వేసుకుంటే ఉరేనని, కౌలు రైతు, రైతే కాదని చెప్పిన సన్నాసి ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ నిప్పులు చెరిగారు. 60 ఏండ్లలోపు చనిపోతేనే రైతులకు బీమా ఇస్తడట. ఇదెక్కడి దిక్కుమాలిన పాలన? అంటూ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.