సెమిస్టర్ పరీక్షలపై ఓయూలో టెన్షన్, టీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరిన మర్రి
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీలో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలంటూ విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. పోలీస్ బందోబస్తు మధ్య సెమిస్టర్ పరీక్షలు ఈరోజు ప్రారంభమైన సంగతి తెలిసిందే. పరీక్షలను వాయిదా వేయాలంటూ విద్యార్ధులు బహిష్కరించారు.
దీంతో యూనివర్శిటీ అధికారుల తీరును నిరసిస్తూ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. పరీక్షలు వాయిదా వేసే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు పేర్కొన్నారు.
ఇప్పటికి తమ సిలబస్ పూర్తి కాలేదని, దీంతో పరీక్షలను వారం రోజుల పాటు వాయిదా వేయాలన్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అయితే, యూనివర్సిటీ అధికారులు మాత్రం అందుకు ఒప్పుకోలేదు.
మరోవైపు ఓయూ పరిధిలో నిర్వహించే పీజ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయడం సాధ్యపడదని, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారంగానే సోమవారం నుంచి జరుగుతాయని ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఈ. సురేష్ తెలిపారు.
పరీక్షలు వాయిదా వేయడం వల్ల అకడమిక్ పరంగా ఇబ్బందులు ఎదురవుతాయని, ఇప్పటికే సిలబస్ పూర్తయిందని ఆయన పేర్కొన్నారు. పరీక్షలు వాయిదా వేయడం వల్ల తలెత్తే సమస్యలను విద్యార్ధులకు ఇప్పటికే వివరించామని, అయినా పరీక్షలు వాయిదా వేయాలంటూ ఆందోళన చేస్తున్నారని పేర్కొన్నారు.
గ్రేటర్ ఎన్నికలకు రంగం సిద్ధం: జీహెచ్ఎంసీ కమిషనర్
జీహెచ్ఎంసీ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణకు 50 వేల మంది ఉద్యోగులు అవసరమని, ఇతర జిల్లాల నుంచి ఉద్యోగులను రప్పిస్తున్నామని చెప్పారు.
8 వేల పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, 11 వేలకు పైగా ఈవీఎంలను ఉపయోగించనున్నామని అన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ఓటు వేయడంపై ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నామని ఆయన వివరించారు.
సనత్ నగర్లో ఎన్నికలు నిర్వహించండి: మర్రి శశిధర్రెడ్డి
కేంద్ర ఎన్నికల ప్రధానాధికారితో కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి సోమవారం భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఓట్ల తొలగింపుపై ఆయనకు ఫిర్యాదు చేశారు. ఆధార్ అనుసంధానం పేరుతో ఓట్లను తొలగించారని ఆయన ఆరోపించారు.
సనత్ నగర్లో పోటీ చేసే దమ్ము లేక టీఆర్ఎస్ భయపడతుందని ఆయన విమర్శించారు. దమ్ముంటే సనత్ నగర్కు ఉప ఎన్నిక నిర్వహించి, టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్ధిని గెలుపించుకోవాలని ఆయన సవాల్ విసిరారు.