మార్చిలో టెట్ నోటిఫికేషన్, ఏప్రిల్లో డిఎస్సీ: మంత్రి కడియం
హైదరాబాద్: తెలంగాణలో వచ్చే ఏడాది మార్చి తొలివారంలో టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ రెండో వారంలో టెట్ పరీక్ష నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అదే విధంగా ఏప్రిల్ చివరి వారంలో డీఎస్సీని ప్రకటించి జూన్ రెండో వారంలో పరీక్ష నిర్వహిస్తామని అన్నారు. జూన్ చివరి వారంలో డీఎస్సీ ఫలితాలను వెల్లడించి, జులై రెండో వారంలో అభ్యర్థులకు పోస్టింగులు ఇస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఇంటర్ ప్రయోగ పరీక్షల్లో జంబ్లింగ్ విధానం ఉండదని కడియం తెలిపారు.
తెలంగాణలో 45వేలకు పైగా గృహాలకు కేంద్రం అనుమతి
తెలంగాణ రాష్ట్రంలో 45వేలకు పైగా గృహాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అన్ని ఇళ్లను కేంద్రం మంజూరు చేయటం గమనార్హం. కాగా, ఈ నేపథ్యంలో మరికొన్ని ఇళ్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. గతంలో రాష్ట్రానికి 10వేల ఇళ్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణను ప్రారంభించిన నారా బ్రాహ్మణి
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఈ శిక్షణను ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీ నారా బ్రాహ్మణి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ప్రతిభావంతులైన నిరుద్యోగులకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు బ్రాహ్మణి చెప్పారు.