బీజేపీలో చేరుతున్నాడంటూ వచ్చిన వార్తలపై హరీష్ రావు సీరియస్.. మీడియా సంస్థ క్షమాపణకు డిమాండ్
హైదరాబాద్ : తనపై వస్తున్న అసత్య వార్తలపై మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత హరీష్ రావు స్పందించారు. త్వరలో తాను బీజేపీ పార్టీ లోకి మారబోతున్నానంటూ వస్తున్న వార్తలను హరీష్ రావు ఖండించారు. హరీష్ రావు పార్టీ మారుతున్నాడంటూ ఈ రోజు ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది. అయితే వార్త చివరన ఏప్రిల్ 1 తేదీ సందర్భంగా ఏప్రిల్ ఫూల్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఐనప్పటికీ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో హాట్ టాపిక్గా మారింది. దీనికి స్పందించిన హరీష్ రావు ఆ వార్తా కథనాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. 'ప్రముఖ మీడియా సంస్థ నాపై ప్రచురించిన వార్త ఫేక్ న్యూస్కు గొప్ప ఉదాహరణగా చెప్పొచ్చన్నారు హరీష్ రావు.
అయితే యావత్ భారతదేశం మొత్తం ఫేక్ న్యూస్కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఇలాంటి తరుణంలో తప్పుడు వార్తలను, అది ఫ్రాంక్ న్యూస్ అయినా సరే ప్రసారం చేయడం పద్ధతి కాదనే అభిప్రాయాన్ని హరీష్ వ్యక్తం చేసారు. ఇటువంటి చిల్లర వార్తలను ఇంకెప్పుడూ ప్రచురించొద్దని మీడియా సంస్థలను కోరుతున్నారు హరీష్. ఇదే సమయంలో, తనపై తప్పుడు వార్తను ప్రచురించిన పేజీలోనే రేపు(మంగళవారం) క్షమాపణలు చెబుతూ మరో వార్తను ప్రచురించాలని డిమాండ్ చేస్తున్నాను'అని హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా సదరు మీడియా సంస్థను హెచ్చరించారు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో. ఏప్రిల్ ఫస్ట్ వార్తతో జనాన్ని కాస్త అలరిద్దాం అనుకున్న ఆ మీడియా సంస్ధకు హరీష్ హెచ్చరికలు శరాఘాతంలా పరిణమించాయి.