Rain Alert: తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..
మంగళవారం ఉదయం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, సిరిసిల్ల, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో మోస్తరు వానలు పడ్డాయి. పలు ప్రాంతాల్లో ఐకేపీ, మార్కెట్ కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. వడ్ల కొనగోలు ఆలస్యంగా జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐకేపీ, మార్కెట్ నిర్వహకులు మాత్రం లారీల కొరత వల్ల ధాన్యం కొనుగోలు చేయలేకపోతున్నామని చెబుతున్నారు. మిల్లుల వద్ద లారీలు అన్ లోడ్ కాకపోవడంతో లారీ కొరత ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది.
మరో వైపు తెలంగాణలో రాబోయే మూడు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ నుంచి తెలంగాణ, ఉత్తర తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉత్తర, దక్షిణ ద్రోణి ఏర్పడిందని తెలిపింది.

బుధ, గురువారాల్లో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీయడంతో పాటు తేలిపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న మూడు రోజులకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కానీ గాలలు మాత్రం ఉండవని వివరించింది. మంగళవారం మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
సోమవారం పలు ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, హనుమకొండ, మహబూబ్నగర్, ఖమ్మం, రామగుండం, నల్గొండ, నిజామాబాద్ సహా పలు ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు అయింది. వచ్చే మూడు రోజులు పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల వరకు, హైదరాబాద్ సమీప జిల్లాల్లో 38 నుంచి 41 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications