ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో దొంగలు తయారయ్యారు.. అటవీ అధికారులకు సీఎం కేసీఆర్ క్లాస్!!
తెలంగాణ సీఎం కేసీఆర్ గోదావరి వరద ముంపుతో ప్రభావితమైన ప్రాంతాలలో పర్యటించి ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో, భద్రాచలంలో పర్యటించిన తెలంగాణ సీఎం కేసీఆర్, నేడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ను సందర్శించనున్నారు. నిన్న రోజంతా వర్షంలో, ములుగు జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్, అటు భద్రాచలంలో గోదావరి ఉధృతి పరిశీలించారు. గోదావరి నదికి శాంతి పూజలు నిర్వహించారు. ఇక ఫారెస్ట్ అధికారులకు క్లాస్ తీసుకున్నారు.

ఏడాదిలోగా గోదావరి వరదలకు శాశ్వత పరిష్కారం చూపిస్తా
ఏడాదిలో గోదావరి వరదల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. హనుమకొండ నుంచి రోడ్డు మార్గాన ములుగుజిల్లా ఏటూరునాగారం చేరుకున్న సీఎం, మొదటి ఏటూరునాగారంలో ఆగకుండా అక్కడ నుండి భద్రాచలం వెళ్లి, మళ్ళీ తిరిగి అక్కడి నుండి హెలికాప్టర్ ద్వారా ఏటూరునాగారం చేరుకున్నారు. భద్రాచలం నుండి తుపాకులగూడెం వరకు గోదావరి పరివాహక ప్రాంతంలో వరద ప్రభావంపై ఏరియల్ సర్వే నిర్వహించారు. ఏటూరునాగారం ఐటీడీఏ గెస్ట్ హౌస్ లో లంచ్ చేసిన తర్వాత రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరికి శాంతి పూజలు చేసి వరద ముంపుకు గురైన ఎస్సీ ఎస్టీ కాలనీల్లో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు.

సీతక్కతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన సీఎం కేసీఆర్
ములుగు జిల్లాలో ఎమ్మెల్యే సీతక్క తో కలిసి వరద ముంపుకు గురైన ప్రాంతాలలో పరిస్థితులు పరిశీలించి ప్రజలకు వచ్చే సంవత్సరం నుంచి వరద ముంపు సమస్య లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయానికి చేరుకొని ఉమ్మడి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.

అధికారులకు సూచనలు,... అటవీ అధికారులపై ఆగ్రహం
వర్షాలు, వరదల కారణంగా తెగిన చెరువులు, దెబ్బతిన్న రోడ్లు, మిషన్ భగీరథ పైప్ లైన్ లను వెంటనే మరమ్మత్తులు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలలో ముంపుకు గురవుతున్న వారికి, వేరే ప్రాంతాలలో శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని కేసీఆర్ సూచించారు. ఇక ఇదే సమయంలో ఏటూరునాగారంలో సమీక్ష సందర్భంగా అటవీ శాఖ అధికారులపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపడితే అభ్యంతరం ఏమిటంటూ అటవీశాఖ అధికారులను ప్రశ్నించారు కేసీఆర్. ములుగు జిల్లా డి ఎఫ్ ఓ ప్రదీప్ కుమార్ శెట్టిని నిలబెట్టి తిట్టిపోశారు.

ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లో దొంగలు తయ్యారయ్యారన్న సీఎం కేసీఆర్
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో దొంగలు తయారయ్యారని మండిపడ్డ కేసీఆర్, అన్నీ అమ్ముకున్నారని, ఒక చెట్టు అయినా ఉందా? అంటూ డి ఎఫ్ ఓ ను ప్రశ్నించారు. అటవీ ప్రాంతాల్లో రోడ్డు వేయనియ్యం, బ్రిడ్జ్ కట్టనియ్యం, కరెంటు పోల్ వేయనీయం అనటం మంచిది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాపల్లి బ్రిడ్జి నిర్మాణాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు కేసీఆర్. రోడ్డు సౌకర్యం లేక రేషన్ ఇవ్వలేక కలెక్టర్, ప్రజలు చావాలా.. అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన సీఎం.. వెరీ సారీ .. ఇది మంచి పద్ధతి కాదు అంటూ అధికారులను మందలించారు.












Click it and Unblock the Notifications