ఆ ఇద్దరు వెండితెర మీద హిట్ పెయిర్..! ఇప్పుడు ప్రచారంలో తళుక్కుమనబోతున్నారు..!
హైదరాబాద్ : ఆ ఇద్దరు స్టార్లు కొన్ని సంత్సరాలుగా హిట్ సినిమాలు అందించారు. స్టెప్పులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఎన్నో హిట్లు, మరెన్నో సూపర్ హిట్లు అందించిన జంట అది. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఒకే వేదిక పంచుకోబోతున్నారు. సినిమాలు సంచలన విజయం సాదించినట్టే వారి ప్రచారం కూడా ప్రజల్లో విజయం సాదిస్తుందా..? ప్రేక్షకులకు నవరసాలు అందించిన ఆ జంట ఇప్పుడు ప్రజలను తమ ప్రసంగాలతో ఆకట్టుకోగలరా..? ఇంతకీ జనాలకు అంతగా కిరాకు పుట్టించిన ఆ హిట్ పెయిర్ ఎవరు..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బాలక్రిష్ణ, విజయశాంతి..! జనాన్ని ఆకర్శించగలరా..?
త్వరలో హీరో బాలకృష్ణ , హీరోయిన్ విజయశాంతి కలిసి వేదిక పంచుకోనున్నారు. వీరిద్దరు వేరు వేరు పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ తెలంగాణలో జరిగే ఎన్నికల్లో కలిసి ప్రచారం చేయనున్నారు. మహాకూటమి తరుపున వీరిద్దరూ స్టార్ క్యాంపెయినర్స్గా ప్రచారం చేయనున్నారు. వీరిద్దరి జోడితో వచ్చిన అనేక సినిమాలు హిట్టయిన విషయం తెలిసిందే.
ఎన్నో విజయవంతమైన సినిమాలు..! ట్రెండ్ సెట్ చేసిన బాలయ్య, విజయశాంతి...!
80దశకంలో వీరిద్దరూ కాంబినేషన్లు వచ్చిన అనేక సినిమాలు సూపర్హిట్టయ్యాయి. అనేక సంవత్సరాలు కలిసి సినిమాలు తీసి సన్నిహితంగా ఉన్న వీరిద్దరూ తరువాత కలిసి పనిచేయలేదు. వీరిద్దరి కాంబినేషన్లలో మొత్తం 17 సినిమాలు రాగా ఇందులో ఎక్కువ సినిమాలు హిట్టయ్యాయి. చాల కాలం తరువాత వీరు మళ్లీ సినిమాల్లో కాకుండా బయట కలుస్తున్నారు. మహాకూటమి తరుపున వీరిద్దరూ స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారం చేయనున్నారు.
విజయశాంతి కాంగ్రెస్..బాలయ్య టీడిపి..! ఐనా కూటమి గెలుపుకోసం కలిసి ప్రచారం..!!
ఇప్పటికే విజయశాంతి కాంగ్రెస్ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. బాలకృష్ణ కూడా ఒక రోజు ఖమ్మంలోని మూడు నియోజకవర్గాల్లో టీడీపీ తరుపున ప్రచారం చేశారు. మళ్లీ తిరిగి ఆయన ఈనెల 20 నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నట్లు పార్టీవర్గాలు తెలిపాయి. పది రోజుల పాటు ఆయన ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నగర శివార్లలోని నియోజకవర్గాల్లో బాలకృష్ణ, విజయశాంతి కలిసి ప్రచారం చేయనున్నట్లు సమాచారం.
బాలక్రిష్ణకు,రాములమ్మకు అభిమానులు ఎక్కువ..! ఎంతవరకు ప్రభావం ఉంటుందో చూడాలి..!!
త్వరలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ , ఏపీ సీఎం చంద్రబాబు కలిసి నగరంలో రోడ్డుషోలో నిర్వహించనున్నారు. వీరితో పాటు వీరిద్దరూ కూడా ప్రచారంలో పాల్గోనున్నట్లు తెలిసింది. సెటిలర్స్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండే శివారు ప్రాంతాల్లో విజయశాంతి, బాలకృష్ణతో ఎక్కువ ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని మహాకూటమి నేతలు భావిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ ఎంతవరకు హిట్టవుతుందో అనేది మాత్రం వేచి చూడాలి.