నేడే జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక: టీఆర్ఎస్-ఎంఐఎం, మధ్యలో బీజేపీ!
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల్లో ఎవరికీ స్పష్టమైన మెజార్టీ లేకపోయినప్పటికీ.. టీఆర్ఎస్ నుంచే మేయర్, డిప్యూటీ మేయర్లు ఉంటారని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే.
జీహెచ్ఎంసీ మేయర్ బరిలో బీజేపీ.. ఎందుకంటే..?
మరోవైపు 48 స్థానాలు దక్కించుకున్న బీజేపీ కూడా బరిలో నిలిచేందుకు మొగ్గుచూపుతోంది. 48 స్థానాల్లో ఓ కార్పొరేటర్ మరణించడంతో ఇప్పుడు బీజేపీ చేతిలో 47 కార్పొరేటర్ స్థానాలున్నాయి. తమకు పూర్తిస్థాయి బలం లేకపోయినప్పటికీ టీఆర్ఎస్, ఎంఐఎం పొత్తు గురించి ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోనే ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు బీజేపీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గురువారం మేయర్ ఎన్నిక నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆఫీస్ చుట్టు పక్కల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అటుగా వచ్చే వాహనాలను వేరే మార్గాల్లో దారి మళ్లించనున్నారు.
అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్.. కానీ..
గత డిసెంబర్ నెలలో జీహెచ్ఎంసీలోని 150 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన 56 మంది కార్పొరేటర్లు గెలుపొందారు. దీంతో అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ ఆవిర్భవించింది. ఇక 48 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. పాతబస్తీలో మరోసారి పట్టు నిలుపుకున్న ఎంఐఎం 44 స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలకే పరిమితమైంది. ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది.
టీఆర్ఎస్కు ఎంఐఎం మద్దతే కీలకం..
జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల సంఖ్య 150 కాగా, కరోనాతో బీజేపీ కార్పొరేటర్ ఒకరు మృతి చెందారు. దీంతో ఆ సంఖ్య 149కి పడిపోయింది. మొత్తం 44 మంది ఎక్స్ అఫీషియో సభ్యులను కలుపుకుంటే మేయర్ ఎన్నికల్లో ఓటు వేసే వారిసంఖ్య 193కి చేరుతుంది.మొత్తం 44 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల్లో టీఆర్ఎస్ 31 మంది, బీజేపీకి ఇద్దరు, కాంగ్రెస్ కు ఒక్కరు, ఎంఐఎంకు 10 మంది ఉన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతు కలిపిన టీఆర్ఎస్ మేయర్ పీఠం దక్కించుకునే అవకాశం లేకపోవడంతో ఎంఐఎం మద్దతు తప్పనిసరి అని విశ్లేషకులు అంటున్నారు. ఎంఐఎం బయటి నుంచి మద్దతిస్తుందా? లేక ఏదైనా పదవి అడుగుతుందా? అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. మరోవైపు మేయర్ ఎవరు అవుతారనేది కూడా ఉత్కంఠగా మారింది.