నేడు కేసీఆర్ కదనభేరి సభ.. కరీంనగర్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కెసిఆర్ నేడు కరీంనగర్ లో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. రానున్న లోక్సభ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కేసీఆర్ ఈ ఎన్నికలలో అత్యధిక స్థానాలు సాధించడమే లక్ష్యంగా ప్రజల లోకి వెళ్లాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే కెసిఆర్ కరీంనగర్ ఎస్సార్ కళాశాల వేదికగా భారీ బహిరంగ సభను కదనభేరి సభ పేరుతో నిర్వహించనున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిపాలైన తర్వాత తొలిసారిగా కేసీఆర్ కరీంనగర్ కు రానున్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కేసీఆర్ తొలిసారిగా నల్గొండ జిల్లాలో కృష్ణా జలాలపై తొలి సభను నిర్వహించారు. ఇప్పుడు కరీంనగర్ లో రెండవ సభ ద్వారా కెసిఆర్ రానున్న లోక్సభ ఎన్నికలకు ప్రజల మద్దతు కోసం ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు.

కరీంనగర్ లో నేడు నిర్వహించనున్న కదనభేరి సభను చాలా సెంటిమెంటుగా భావిస్తున్న బి ఆర్ ఎస్ పార్టీ దీనికోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జన సమీకరణ చేస్తోంది . కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న వినోద్ కుమార్ నేటి సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
ఇక ఈ సభ వేదికగా పార్లమెంట్లో బి ఆర్ ఎస్ ఎంపీల అవసరమేమిటో కెసిఆర్ చెప్పనున్నారని, సాయంత్రం నాలుగు గంటలకు ఈ సభ ప్రారంభమవుతుందని కరీంనగర్ ఎంపీఅభ్యర్థి వినోద్ కుమార్ వెల్లడించారు . తెలంగాణా గుండెతో ఆలోచిస్తేనే ప్రజల కష్టాలు అర్ధం అవుతాయని, కాంగ్రెస్ పాలన మొదలుపెట్టి నాలుగు నెలలైనా కాక ముందే రాష్ట్రంలో కరువు పరిస్థితులు వచ్చాయని, పంట పొలాలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తుందని మండిపడ్డారు.
తాజాగా రాష్ట్రంలో పరిస్థితులు, కేంద్రంలో బీఆర్ఎస్ ఎంపీల అవసరాన్ని ఈ సభా వేదికగా కేసీఆర్ చెప్తారన్నారు. తెలంగాణాకు బీజేపీ, కాంగ్రెస్ లు ఎలా నష్టం చేస్తున్నాయో, కేసీఆర్ బహిరంగ సభలో చెప్తారన్నారు. పార్లమెంట్ లో తెలంగాణా గొంతు వినిపించాలంటే ముందు బీఆర్ఎస్ ను గెలిపించాలన్నారు. కాగా కేసీఆర్ సభ నేపధ్యంలో కరీంనగర్ సెంటిమెంట్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications