మేడారం వెళ్ళేవారిపై టోల్ బాదుడు.. జాతర రోజుల్లో టోల్ వసూళ్లు నిలిపివెయ్యాలని భక్తుల విజ్ఞప్తి
దేశంలో కుంభమేళా తరువాత జరిగే అతిపెద్ద జాతర ఏదైనా ఉంటే అది మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. అందుకే దీనిని తెలంగాణా కుంభ మేళా అని పిలుస్తారు ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ మాసంలో నాలుగు రోజుల పాటు కన్నుల పండువగా జరిగే ఈ గిరిజన జాతరకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా లక్షలాది భక్తులు తరలి వచ్చి, ప్రకృతి దేవతలను దర్శించుకుని తరిస్తారు.
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్తున్నారా.. ట్రాఫిక్ లో చిక్కుకోకుండా పోలీసుల సూచనలు తెలుసుకోండి
మేడారం భక్తులపై టోల్ బాదుడు ... ఇబ్బంది పడుతున్న భక్తులు
ఇదిలా ఉంటే మేడారం జాతరకు వచ్చే భక్తులకు టోల్ గేట్ చార్జి లు అదనపు భారంగా మారుతున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్ నుండి మేడారానికి రావాలి అంటే యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లా రఘునాథ్ పల్లి మండలం కోమల్ల, హనుమకొండ హసన్పర్తి మండలం కోమటిపల్లి, ములుగు జిల్లా జవహర్ నగర్ వద్ద మొత్తం నాలుగు టోల్ గేట్లను దాటవలసి ఉంటుంది. మేడారం జాతరకు కరీంనగర్ నుండి వచ్చే వారికి మూడు టోల్ గేట్లను దాటాల్సి ఉంటుంది. ఈ క్రమంలో టోల్ చార్జీలు భక్తులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నాయి. అంతేకాకుండా టోల్ గేట్ ల వద్ద టోల్ చార్జీలను వసూలు చేస్తుండటంతో వాహనాలు భారీగా నిలిచిపోతున్నాయి. ట్రాఫిక్ ఇబ్బంది కూడా కలుగుతుంది.
టోల్ వసూళ్లు నిలిపివెయ్యాలని భక్తుల నుండి డిమాండ్
చాలా మంది భక్తులు ప్రైవేటు వాహనాలలో మేడారంజాతరకు వస్తుంటారు. నాలుగు రోజులపాటు మేడారంలోనే ఉండి తల్లుల ఆగమనాన్ని చూసి, మొక్కులు చెల్లించుకుని తిరుగు ప్రయాణం అవుతారు. ఈ నేపథ్యంలో భక్తులకు దాదాపుగా ఐదు వందల రూపాయల వరకు టోల్ చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఇక ఇది భక్తులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు టోల్ వసూలు నిలిపివేయాలని భక్తుల నుండి ప్రధానంగా డిమాండ్ వినిపిస్తోంది.
జవహర్ నగర్ వద్ద టోల్ వసూళ్లు నిలిపివేత, హైదరాబాద్, కరీంనగర్ మార్గాలలోనూ వద్దని విజ్ఞప్తి
అయితే ములుగు జిల్లా జవహర్ నగర్ వద్ద ఇప్పటికే వారం పాటు అధికారులు టోల్ గేట్ చార్జీల చెల్లింపు నిలిపివేశారు. హైదరాబాద్ నుండి వచ్చే వారికి, కరీంనగర్ నుంచి వచ్చే వారికి కూడా టోల్ గేట్ల వసూళ్లు నిలిపివేస్తే మహా జాతరకు వచ్చే వారికి కష్టాలు తీరుతాయని భక్తులు చెబుతున్నారు. జాతర జరుగుతున్న నాలుగైదు రోజులైనా టోల్ చార్జీలకి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరి మేడారం మహాజాతర ఈ నెల 16వ తారీకు నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం టోల్ ఛార్జీల విషయంలో నిర్ణయం తీసుకుంటుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
మేడారం జాతరకు ప్రధాన సమస్య ట్రాఫిక్ ... రూట్ మ్యాప్ ఇచ్చిన పోలీసులు
అయితే మేడారం జాతరకు వెళ్లాలంటే ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రధానంగా మేడారం జాతరలో ట్రాఫిక్ సమస్య కనిపిస్తుంది. జాతర జరిగే నాలుగు రోజులు వివిధ రాష్ట్రాల నుంచి వాహనాలలో భక్తులు మేడారానికి రావడంతో ట్రాఫిక్ సమస్య కనిపిస్తుంది. అయితే ట్రాఫిక్ సమస్యను ఎదుర్కోవడం కోసం, ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రజలు ప్రయాణం చేయడం కోసం ఇప్పటికే మేడారం రూట్ మ్యాప్ ను పోలీసులు విడుదల చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారు ఏ రూట్ లో రావాలి, ఏ రూట్లో తిరిగి వెళ్లాలి అనేది, వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేయాలి అనేది స్పష్టంగా సూచిస్తున్నారు.