సిరివెన్నెల..కన్నుమూత: 14 నెలల్లో గాయకుడు, నృత్యదర్శకుడు, ఇప్పుడు గేయ రచయిత
హైదరాబాద్: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రఖ్యాత కోరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టార్ కన్నుమూసిన ఉదంతాన్ని విస్మరించకముందే పెను విషాదం మిగిలింది. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 66 సంవత్సరాలు. న్యుమోనియాతో బాధపడుతోన్న ఆయన కొంతకాలంగా సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

24న అనారోగ్యంతో..
న్యుమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల సీతారామ శాస్త్రిని కుటుంబ సభ్యులు ఈ నెల 24వ తేదీన ఆసుపత్రిలో చేర్చారు. అప్పటి నుంచి ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోనే ఉంటున్నారు. రోజురోజుకూ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది. కిమ్స్ డాక్టర్లు అత్యాధునికమైన వైద్య చికిత్సను అందించినప్పటికీ.. ప్రాణాలను నిలపలేకపోయారు. ఊపిరితిత్తుల్లో నెమ్ము అధికంగా చేరినట్లు తెలుస్తోంది. ఊపిరి పీల్చుకోవడంలో ఆయన తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని సమాచారం.

షాక్లో టాలీవుడ్..
సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం పట్ల తెలుగు చలన చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. తెలుగు సినిమా సాహిత్యాన్ని ఓ మలుపు తిప్పారాయన. ఆరుద్ర, ఆత్రేయ, వేటూరి సుందర రామ్మూర్తి తరువాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. మూడువేలకు పైగా పాటలను రాశారు. ఆయన కలం నుంచి జాలువారిన ప్రతి పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సాహిత్యానికి, సాధారణ పదాలను చేర్చి పాటలను రాయడం ఆయన ప్రత్యేకత. అదే స్థాయిలో సంగీత దర్శకులు ఆయన పాటలక బాణీలను కట్టేవారు. ఫలితంగా అవి చిరస్మరణీయంగా మిగిలిపోయాయి.

సిరివెన్నెల ఇంటిపేరుగా..
సిరివెన్నెల సీతారామ శాస్త్రి అసలు పేరు చెంబోలు సీతారామ శాస్త్రి. ఆయన స్వస్థలం అనకాపల్లి. ఆంధ్రా యూనివర్శిటీలో చదువుకున్నారు. ఎంఏ చేస్తోన్న సమయంలో ఆయన అనుకోకుండా టాలీవుడ్లో ప్రవేశించారు. కళాతపస్వి కే విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన జననీ జన్మభూమి సినిమాకు పాటలు రాశారు. 1986లో కే విశ్వనాథ్ దర్శకత్వంలోనే వచ్చిన సిరివెన్నెల మూవీ సూపర్ హిట్ అయింది. దీనితో ఆ సినిమా పేరు సీతారామ శాస్తికి ఇంటి పేరుగా మారింది.

ఎన్నో అవార్డులు..
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కే విశ్వనాథ్ మొదలుకుని త్రివిక్రమ్ శ్రీనివాస్ వరకూ అందరు దర్శకులతోనూ సీతారామ శాస్త్రి పని చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లుడి వరుస అవుతారు. ఆయన సోదరుడి కుమార్తెను త్రివిక్రమ్ పెళ్లాడారు. సిరివెన్నెలకు వరించని అవార్డులంటూ లేవు. అత్యుత్తమ పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి 10 సార్లకు పైగా నంది అవార్డును అందుకున్నారు. నాలుగుసార్లు ఫిల్మ్ఫేర్ అవార్డును స్వీకరించారు.

నటుడు..గాయకుడు కూడా..
కేఎస్ రఘు దర్శకత్వంలో వచ్చిన కళ్లు సినిమాలో తెల్లారింది లెగండోయ్ అనే పాటను ఆయనే పాడారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన గాయం సినిమాలో నటించారు. నిగ్గదీసి అడుగు అనే పాటను ఆయనే రాశారు. కళాసాగర్, మనస్విని, కిన్నెర, భరతముని, వంశీ-బర్కిలీ, రసమయి వంటి సాంస్కృతిక సంఘాలు ఆయనకు అవార్డులు ఇచ్చి సత్కరించాయి. ఇళయరాజా, కీరవాణి, కేఎస్ మహదేవన్ వంటి టాప్ సంగీత దర్శకులు ఆయన పాటలకు బాణీలను కట్టారు.
Recommended Video

14 నెలల కాలంలో
14 నెలల కాలంలో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ.. తన మూల స్తంభాలను కోల్పోయినట్టయింది. గత ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన ఎస్సీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారు. ఈ ఏడాది డాన్స్ మాస్టర్ శివశంకర్, ఆ వెంటనే గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ లోకాన్ని వీడివెళ్లారు. ఈ ముగ్గురూ ఒకే ఫీల్డ్కు చెందిన వారే.












Click it and Unblock the Notifications