తెలంగాణ సరిహద్దు అటవీప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతలు? గోదావరీ తీరంలో డ్రోన్లతో పోలీసుల నిఘా!!
జులై 28వ తేదీ నుండి ఆగస్టు 3వ తేదీ వరకు మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు అలర్ట్ అయిన విషయం కూడా తెలిసిందే. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా తెలంగాణ, మహారాష్ట్ర , ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల అలజడి సృష్టించి అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో అలర్ట్ అయిన పోలీసులు గోదావరీ తీరంలో డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. సరిహద్దు అటవీ ప్రాంతాన్ని అడుగడుగున జల్లెడ పడుతున్నారు.
మూడు రాష్ట్రాల సరిహద్దు అటవీప్రాంతంలోకి మావోయిస్ట్ అగ్రనేతలు
వరుస ఎన్కౌంటర్ లు, లొంగుబాట్లతో కుదేలవుతున్న మావోయిస్ట్ పార్టీ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తుంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. అందుకు మావోయిస్ట్ వారోత్సవాలను ఉపయోగించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. వివిధ ప్రాంతాల నుండి మావోయిస్ట్ అగ్రనేతలు మూడు రాష్ట్రాల సరిహద్దు అటవీప్రాంతంలోకి వచ్చారని ఇంటలిజెన్స్ వర్గాలు పోలీసులకు సమాచారం ఇచ్చాయి.
మూడు రాష్ట్రాల సరిహద్దు, గోదావరి తీరంలో పోలీసులు డ్రోన్ లతో నిఘా
గోదావరి తీరంలో మళ్లీ మావోయిస్టుల కదలికలు ఉన్నాయని, అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించేందుకు మావోయిస్టులు వచ్చారని, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులో నక్సల్స్ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసు వర్గాలు ఇలాంటి సంఘటనలు జరగకుండా సరిహద్దు ప్రాంతాలలో పహారా కాస్తున్నారు . ఇంటెలిజెన్స్ సమాచారంతో పాటు, ఏటూరునాగారం, వెంకటాపూర్ ప్రాంతాల్లో రెండు రోజులుగా మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ పేరిట కరపత్రాలు, వాల్ పోస్టర్లు కనిపించడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈనేపథ్యంలో మూడు రాష్ట్రాల సరిహద్దు, గోదావరి తీరంలో పోలీసులు డ్రోన్ లతో నిఘా ఏర్పాటు చేశారు.
ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం సరిహద్దు అడవుల్లో గ్రేహౌండ్స్ బలగాల మోహరింపు
ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం సరిహద్దు అడవుల్లో గ్రేహౌండ్స్ బలగాలను మోహరించారు. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఉద్యమంలో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 8,700 మందికి పైగా తమ సభ్యులు మృతిచెందినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఇటీవల సంవత్సరాల్లో కరోనా వైరస్, కోవర్టుల కారణంగా ఆపార్టీ పలువురు ఉద్యమకారులను, కీలక నేతలను కోల్పోయింది. ఈనేపథ్యంలో అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను మళ్లీ తమ ఉనికిని చాటేలా మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్టు కరపత్రాల్లో ప్రకటించింది. దీంతో పోలీసులు మూడు రాష్ట్రాల సరిహద్దులో నిఘా పెంచారు.
ప్రత్యేక బలగాలను రంగంలోకి దించిన తెలంగాణ, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు, తర్వాత కూడా నక్సల్సైపై ప్రభుత్వాల వైఖరి మారలేదు. గత మూడేళ్ళుగా మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బతగిలింది. అగ్రనాయకులతోపాటు మొత్తం 173 మంది నక్సల్స్ మరణించారు. ఓ వైపు పోలీసు ఎన్ కౌంటర్లు, మరో వైపు కరోనా వైరస్ మావోయిస్టు పార్టీ కీలక నేతలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈనేపథ్యంలో తమ ప్రాబల్యాన్ని తెలియజేసేలా అమరవీరుల సంస్కరణ వారోత్సవాలు తప్పకుండా నిర్వహించాలని పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. తెలంగాణ, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక బలగాలను రంగంలోకి దించాయి. అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దని ప్రజాప్రతినిధులకు సూచనలు చేశారు. హిట్ లిస్ట్ లో ఉన్న ప్రజా ప్రతినిధులకు భద్రతను పెంచారు.