డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చినా పెండింగ్ చలాన్లు కట్టని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల షాక్!!
పెండింగ్లో ఉన్న చలాన్ లను చెల్లించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని వాహనదారులకు డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ డిస్కౌంట్ ఆఫర్ కు వాహనదారుల నుండి అపూర్వమైన స్పందన వచ్చింది. దాదాపు నెల 15 రోజుల పాటు కొనసాగిన ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ప్రత్యేక రాయితీ పొందే అవకాశం ఉండడంతో వాహనదారులు పెండింగ్ చలానాలు చెల్లించడం కోసం పోటీ పడ్డారు.
పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ కు ఇచ్చిన డిస్కౌంట్ ఆఫర్ కు భారీ స్పందన
రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఫైన్ లు పడిన వాహనదారులు ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ తో భారీగానే చలాన్లు చెల్లించారు. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా మూడు కోట్లకు పైగా పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యాయి. అంతేకాదు 65 శాతం కార్ల యజమానులు, 70 శాతానికి పైగా ద్విచక్ర వాహనదారులు తమ పెండింగ్ చలానా లను క్లియర్ చేసుకున్నారు. మొత్తం 17 వందల కోట్ల పెండింగ్ చలాన్ల లో ఇప్పటివరకు 1004 కోట్ల పెండింగ్ చలాన్లు వసూల్ అయ్యాయని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
30 శాతం మంది వాహనాల పెండింగ్ చలాన్లు క్లియర్ కాలేదు
డిస్కౌంట్ ఆఫర్ కారణంగా పెండింగ్ చలాన్లలో ప్రభుత్వం ఇచ్చిన డిస్కౌంట్ పోగా మొత్తం 312 కోట్ల రూపాయలు వసూలు అయినట్టుగా వారు తెలిపారు. ఇక దాదాపు నెల 15 రోజుల పాటు డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చినప్పటికీ పెండింగ్ చలాన్లు చెల్లించకుండా చాలామంది వాహనాలపై తిరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. సుమారు రాష్ట్రంలో 30 శాతం మంది వాహనాల పెండింగ్ చలానాలు క్లియర్ కాలేదని సమాచారం. ఈ క్రమంలో డిస్కౌంట్ ఆఫర్ పెట్టినా పెండింగ్ చలాన్లు కట్టని వారిపై కొరడా ఝుళిపించటానికి ట్రాఫిక్ పోలీసులు రెడీ అవుతున్నారు.
పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ కోసం స్పెషల్ డ్రైవ్
పెండింగ్ చలానాలు చెల్లించని వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం కోసం రెడీ అయినట్లుగా సిటీ ట్రాఫిక్ జాయింట్ సి పి రంగనాథ్ వెల్లడించారు. రాయితీ ముగిసిన తర్వాత కూడా ఇంకో 30 శాతం మంది వాహనదారులు చలనాలు చెల్లించకుండా రోడ్లపై తిరుగుతున్నట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. ఎవరైతే చలాన్లు చెల్లించకుండా రోడ్లపై తిరుగుతారో వారిపై కేసులు నమోదు చేస్తామని సి పి రంగనాథ్ వెల్లడించారు. చలాన్లు చెల్లించకుండా తిరుగుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ సి పి రంగనాథ్ వార్నింగ్ ఇచ్చారు.
పెండింగ్ చలాన్లు చెల్లించకుంటే కఠిన చర్యలు
ఇక పోలీసులు కఠిన చర్యలకు సిద్ధం అని చెప్తున్న క్రమంలో నిజంగా పెండింగ్ చలాన్లు కట్టే ఆలోచన ఉన్నవారు ఎవరైనా ప్రభుత్వం ప్రత్యేక రాయితీ ఇచ్చినప్పుడే కట్టేవాళ్ళు కదా అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరోవైపు ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసుల ఆగ్రహానికి గురి కాకుండా పెండింగ్ చలాన్లు చెల్లిస్తే మంచిదని సూచిస్తున్నారు.