టార్గెగ్ మునుగోడు - టీఆర్ఎస్ నయా స్కెచ్ : రాజగోపాల్ క్లారిటీతో..!!
ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఫోకస్ అవుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తాజాగా చేసిన ప్రకటనతో టీఆర్ఎస్ అప్రమత్తం అయింది. మునుగోడు నుంచే టీఆర్ఎస్ పతనం మొదలవుతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో...అక్కడ ఇప్పటికిప్పుడు కాకున్నా..త్వరలోనే బై పోల్ వచ్చే అవకాశం ఉందనే అంచనాలు గులాబీ నేతల్లో వ్యక్తం అవుతున్నాయి. తాను కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశం అయ్యానని..అయితే, రాజకీయాలపైన చర్చ చేయలేదని రాజగోపాల్ చెప్పుకొచ్చారు.
రాజీనామా లేదంటున్న రాజగోపాల్
టీపీసీసీ చీఫ్ రేవంత్ పైన చేసిన పరోక్ష వ్యాఖ్యలతో ఆయన కాంగ్రెస్ లో ప్రస్తుతానికి కంటిన్యూ అవుతున్నా.. ఎక్కువ రోజులు కొనసాగరనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అందుకోసం ఆగస్టు నెలాఖరులోగా ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందని..పక్క ప్లాన్ ప్రకారమే రాజగోపాల్ అడుగులు వేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
దీంతో..టీఆర్ఎస్ అలర్ట్ అయింది. రాజగోపాల్ రెడ్డి అడుగులను నిశితంగా పరిశీలిస్తోంది. మంత్రి జగదీష్ రెడ్డి అక్కడ బాధ్యతలు తీసుకున్నారు. రాజగోపాల్ రెడ్డి పైన విమర్శలు చేసారు. తన రాజీనామా వార్తలు.. ఉప ఎన్నిక ప్రచారంతోనే తన నియోజకవర్గంలో గట్టుప్పల్ మండలం ఏర్పాటైందని రాజగోపాల్ చెబుతున్నారు.
వచ్చే నెలలో ఉంటుందని టీఆర్ఎస్ అంచనా
అక్కడ గులాబీ పార్టీలో చేరిక పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. మండలాల వారీగా పార్టీల్లో చేరికలు ఉండేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా పూర్తి చేయాల్సిన రిజర్వాయర్లు, భూనిర్వాసితులకు నష్టపరిహారం అందజేయడం, గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.
మండల నేతల ద్వారా ఇతర పార్టీల్లోని వారిని తమ పార్టీలోకి చేర్చుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశానని చెబుతున్నారు. ఆరు నెలలుగా రాజగోపాల్ రెడ్డి నియెజకవర్గంలోకి రాలేదని..ఆయన వ్యాపారాల కోసమే రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపించారు.
గులాబీ పార్టీ ముందస్తు వ్యూహాలు
గత ఎన్నికల్లో తమ పార్టీలోని అంతర్గత సమస్యల వలనే నియోజకవర్గం కోల్పోయామని చెప్పుకొచ్చారు. కానీ, రాజగోపాల్ మత్రం తాను రాజీనామా చేయబోనని, రాజీనామా చేసే విధంగా టీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని, తనకు ఆ ఆలోచన ఉంటే కాంగ్రెస్ కార్యకర్తలు, మునుగోడు ప్రజల అభిప్రాయం తీసుకుని ముందుకు వెళ్తానని స్పష్టం చేసారు. అయినా..టీఆర్ఎస్ మత్రం ముందస్తు చర్యలు ప్రారంభించింది. ఇదంతా..బీజేపీ గేమ్ ప్లాన్ గా టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. దీంతో.. మునుగోడు పైన ముందుగా పూర్తి పట్టు సాధించే క్రమంలో వేగంగా అడుగులు వేస్తోంది.