కేసీఆర్కు మరో తలనొప్పి: టోల్ప్లాజా వద్ద ఎమ్మెల్యే దంపతుల వీరంగం
కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి అధికారి చేపట్టిన టీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో తలనొప్పులు మాత్రం తప్పడం లేదు. తరచూ వివాదాల్లో ఇరుక్కుంటూ పార్టీపై ప్రత్యర్థులు విరుచుకుపడేలా చేస్తూనే ఉన్నారు. తాజాగా, కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేలు దంపతుల వీరంగం సంచలనంగా మారింది.
ఇటీవల నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆడియో టేపుల వ్యవహారం, మంత్రి చందూలాల్ కొడుకు నోటి దురుసు, హైదరాబాద్లో కార్పొరేటర్ల వీరంగం.. ఇప్పుడు చొప్పదండి ఎమ్మెల్యే బొడిగే శో దంపతుల వ్యవహారం టీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతోంది.
అధినేత చెప్పినా..
క్రమశిక్షణతో, ప్రజలకు జవాబుదారిగా ఉండాలని ఓ వైపు టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కే చంద్రశేఖర్ రావు చెబుతున్నప్పటికీ.. ఆ పార్టీ నేతలు మాత్రం తమదైన శైలిలో అధికారంతో జులుం చూపిస్తూనే ఉన్నారు.
ఎమ్మెల్యే దంపతుల వీరంగం
కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే బొడిగ శోభ దంపతులు, గన్మెన్లు మంగళవారం టోల్ ప్లాజా సిబ్బందిపై వీరంగం సృష్టించారు. అక్కడి ఇద్దరు సిబ్బందిపై దాడికి యత్నించారు.
వాగ్వాదం, దాడికి యత్నం
తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామం దగ్గర రాజీవ్ రహదారిపై ఉన్న టోల్ప్లాజా దగ్గర తమ వాహనాలకు టోల్ ఫీజు తీసుకోవద్దంటూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ఆగ్రహంతో ఊగిపోయి సిబ్బందిపై దాడికి యత్నించారు.
సెల్ ఫోన్లు లాక్కున్నారు..
కాగా, ఈ తతంగాన్ని వీడియో తీస్తున్న కొందరి ఫోన్లు కూడా బొడిగె శోభ దంపతులు, అనుచరులు లాక్కెళ్లడం గమనార్హం. ‘మా వాహనాలు ఎందుకు వీఐపీగా గుర్తించరు?' అని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డ్యూటీ తాము చేస్తున్నామని చెప్పినా.. ఎమ్మెల్యే శోభ వినిపించుకోలేదు. కాగా, ఈ ఘటనపై టోల్ గేట్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. కాగా, ఈ ఘటన మరోసారి ప్రతిపక్ష పార్టీలకు అస్త్రంగా మారే అవకాశం కూడా లేకపోలేదు.