రజాకార్ల పాలనలా టీఆర్ఎస్ పాలన; ఆడబిడ్డలకు రక్షణ లేదు: మండిపడిన బండి సంజయ్
రెండవ విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర నిర్వహిస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టిఆర్ఎస్ పాలనపై, సీఎం కేసీఆర్ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. నిజాం కాలంలో రజాకార్లు బయటకు వస్తే మహిళలు భయంతో తలుపులు వేసుకునేవాళ్ళని పేర్కొన్న బండి సంజయ్ ఇప్పుడు టిఆర్ఎస్ పాలనలోనూ అదే పరిస్థితి నెలకొందని మండిపడ్డారు.
టీఆర్ఎస్ పాలనలో దోపిడీ చెయ్యని రంగం లేదు : బండి సంజయ్
టిఆర్ఎస్ పాలనలో ఆడబిడ్డలకు రక్షణ లేదని బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం దోపిడీ చేయని రంగం లేదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన లో బీజేపీ కీలక భూమిక పోషించిందని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణ వచ్చింది కెసిఆర్ వల్ల కాదని పేర్కొన్న బండి సంజయ్, ఎంతో మంది తెలంగాణా బిడ్డల ఆత్మ బలిదానాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సుష్మాస్వరాజ్ పాత్రను గుర్తు చేసిన బండి సంజయ్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకుంటే బీజేపీ ఇస్తుందని నాడు సుష్మాస్వరాజ్ పేర్కొన్నారని బండి సంజయ్ తెలిపారు.
కేసీఆర్ ఇచ్చే హామీలు నమ్మి ఎవరూ మోసపోవద్దు
కాంగ్రెస్ తెలంగాణ బిల్లు పెట్టకుంటే బిజెపి ప్రైవేటు బిల్లు పెడుతుందని సుష్మాస్వరాజ్ నాడు పార్లమెంట్లో ప్రకటించారని బండి సంజయ్ గుర్తు చేశారు. బిజెపి మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్న బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. టిఆర్ఎస్ పార్టీ ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను నమ్మి ఎవరూ మోసపోవద్దని బండి సంజయ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లోకి టిఆర్ఎస్ పార్టీ లీడర్లు వస్తే వారిని విడిచి పెట్టకుండా, చెట్టుకు కట్టేసి మరీ హామీల అమలుపై నిలదీయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
బండి సంజయ్ పాదయాత్ర 10వ రోజు .. ఎండను సైతం లెక్క చెయ్యకుండా ముందుకు
ఫామ్ హౌస్ నుంచి పాలన సాగిస్తున్న కేసీఆర్ కు మళ్లీ పగ్గాలు అప్పగిస్తే, మళ్లీ ఐదేళ్లపాటు ఇంతకుమించిన కష్టాలు అనుభవించాల్సి వస్తుందని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే 10 వ రోజు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర క్రిష్ణం పల్లి, ఇర్లదిన్నె, మిట్ట నందిమళ్ళ, ఎల్లంపల్లి, యంకి గ్రామాల మీదుగా సాగుతుంది.
గ్రామ గ్రామాన పర్యటిస్తూ ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటుగా, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు. గ్రామాలలో సభలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో ఎండను సైతం లెక్కచేయకుండా పాల్గొంటున్నారు.