షాక్: రేవంత్ తో వేదికను పంచుకొన్న టిఆర్ఎస్ నేతలు, టిడిపికి టిఆర్ఎస్ మద్దతు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుంపాడు మండలం సారపాకలోని ఐటీసీపీఎన్ పీడీలో గుర్తింపు కార్మిక సంఘం కోసం జరుగుతున్న ఎన్నికల్లో టిడిపికి టిఆర్ఎస్ మద్దతును ఇస్తోంది. టిడిపికి టిఆర్ఎస్ బద్దశత్రువు.
భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుంపాడు మండలం సారపాకలోని ఐటీసీపీఎన్ పీడీలో గుర్తింపు కార్మిక సంఘం కోసం జరుగుతున్న ఎన్నికల్లో టిడిపికి టిఆర్ఎస్ మద్దతును ఇస్తోంది. టిడిపికి టిఆర్ఎస్ బద్దశత్రువు.
అయితే కార్మికసంఘం ఎన్నికల్లో చిత్ర, విచిత్రమైన పొత్తులు కన్పిస్తున్నాయి. అమీతుమీకి సిద్దమైన రెండు కార్మికసంఘాలు గెలుపు కోసం ఈ రకంగా వ్యవహరిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో టిడిపి టిఆర్ఎస్ ల మధ్య ఉప్పు నిప్పు తరహాలో ఉంది పరిస్థితి. సారపాకలోని గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టిడిపి అనుబంధ కార్మిక సంఘం టిఎన్ టీయూసికి టిఆర్ఎస్ మద్దతు పలికింది.
దీంతో ఈ రెండు పార్టీలకు చెందిన నేతలు చెట్టాపట్టాలేసుకొని ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ కు అనుబంధంగా ఉన్న ఐఎన్ టీయూసీ, సిపీఎం అనుబంధంగా ఉన్న సిఐటియూ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి.
ఐఎన్ టీయూసీ ప్రచారాన్ని పువ్వాడ నాగేశ్వర్ రావు, కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి భుజాన వేసుకొన్నారు. టిఎన్ టియూసి తరుపున రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. టిఎన్ టియూసికి టిఆర్ఎస్ , వైసీపీ, బిఎంఎస్ మద్దతు పలికాయి. వీరంతా ప్రచారం చేయడం కార్మికులనే కాకుండా ప్రజలను కూడ ఆశ్చర్యపరుస్తోంది. టిఎస్ టీయూసి నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.అయితే రేవంత్ రెడ్డితో పాటే టిఆర్ఎస్ నాయకులు కూడ పాల్గొన్నారు. ఈ రెండు పార్టీలకు చెందిన జెండాలను ఏర్పాటుచేశారు. ఈ రెండు పార్టీలకు చెందిన నేతలు కూడ ఈ సభలో పాల్గొనడం విశేషం.
ఎజెండాలను పక్కనపెట్టి జెండాలన్నీ ఒక్కటిగా కదిలి రావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ సంస్థలో 1497 ఓట్లున్నాయి. ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించేలా ప్రచారం నిర్వహిస్తున్నాయి పార్టీలు. టిడిపి, టిఆర్ఎస్ లు ఒకవైపు, కొంతమంది కమ్యూనిష్టులతో కలిసి కాంగ్రెస్ ప్రచారం చేయడంతో రకరకాల ఊహగానాలు మొదలయ్యాయి. ఈ గుర్తింపు కార్మికసంఘం ఎన్నికలు ఎలా ఉన్నా...వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో ఏ రకమైన పరిస్థితులు కన్పిస్తాయో చూడాల్సి ఉంది.