రేవంత్రెడ్డి స్థలం ప్రహరీ గోడని కూల్చేందుకు టీఆర్ఎస్ నేత యత్నం!
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఎ1 నిందితుడు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి చెందిన స్థలం ప్రహరీ గోడను కూల్చేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి నేత అనుచరులు ప్రయత్నించారు. ఫిర్యాదు అందడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
గోపన్నపల్లిలో రేవంత్ రెడ్డికి చెందిన స్థలం ఉంది. దానికి ఉన్న ప్రహరీ గోడను కూల్చేందుకు శంకర్ గౌడ్ అనే టిఆర్ఎస్ నేత అనుచరులు ప్రయత్నించారని సమాచారం.
దీనిపై రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇలాంటి పనులు చేస్తోందని పేర్కొన్నారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు శంకర్ అనుచరులను అదుపులోకి తీసుకున్నారు.
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఏ1 నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. అతను నెల రోజుల పాటు జైలులో ఉన్నారు. అనంతరం బెయిల్ పైన విడుదలయ్యారు. జైలు నుండి విడుదలయి వచ్చాక కూడా కెసిఆర్ పైన తన పోరాటాన్ని ఆపడం లేదు.
మంగళవారం కూడా గోదావరి పుష్కరాలలో కెసిఆర్ స్నానం ఆచరించడంపై స్పందించారు. కేసీఆర్ పుష్కర స్నానం చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం జరుగుతుందన్నారు. వేద పండితులు చెప్పినా వినకుండా కేసీఆర్ పుష్కర స్నానం చేశారని తీవ్ర స్ధాయిలో విమర్శించారు.
కేసీఆర్ వదిన చనిపోవడం వల్ల వారి కుటుంబానికి మైల ఉందని, ఇలాంటి సందర్భంలో కేసీఆర్ పుష్కర స్నానం చేయకూడదని తెలిపారు. లక్ష పాపాలు చేసిన కేసీఆర్ గోదావరి నదిలో ఒక్క మునక మునిగితే ఆ పాపాలన్నీ హరించుకుపోతాయనే భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశాడు.