సీపీఐ మద్దతు లేకున్నా హుజూర్ నగర్ బరిలో గెలుస్తారట: గులాబీ పార్టీ లెక్క ఇదేనట !!
హుజూర్నగర్ ఉప ఎన్నికల పోరు తాజా ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రోజుకో మలుపు తిరుగుతోంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలను మొదటి నుండి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టిఆర్ఎస్ పార్టీ ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. అయితే అనుకోని పరిణామంలా ఆర్టీసీ కార్మికుల సమ్మె అధికారపార్టీకి హుజూర్ నగర్ లో విఘాతం కలిగిస్తోంది. దీనితో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అయినా సరే గెలుపు ధీమా గులాబీ శ్రేణుల్లో కనిపిస్తుంది.
సీపీఐ యూటర్న్ తీసుకున్నా నష్టం లేదు అంటున్న గులాబీ దళం
హుజూర్ నగర్ నియోజకవర్గంలో సీపీఐకి కాస్త పట్టు ఉందని భావించిన నేపద్యంలో సిపిఐతో పొత్తు పెట్టుకుంది టిఆర్ఎస్ పార్టీ. నిన్నటి వరకు టీఆర్ఎస్కు మద్దుతు తెల్పుతున్నామన్న సీపీఐ యూ టర్న్ తీసుకోవాలన్న నిర్ణయంతో ఉప పోరు మరింత రసవత్తరంగా మారింది. సీపీఐ యూటర్న్ తీసుకున్నా సరే టీఆర్ఎస్కు నష్టం లేదని అభిప్రాయపడుతున్నాయి టీఆర్ఎస్ శ్రేణులు. అందుకు బోలెడన్ని లెక్కలు ఉన్నాయని చెప్తున్నారట గులాబీ బాస్.
సిట్టింగ్ స్థానం కావటంతో కాంగ్రెస్ లో టెన్షన్
హుజూర్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్కు ఇది సిట్టింగ్ స్థానం కావడంతో అక్కడ విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది . అందుకోసం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగానే ప్రయత్నం చేస్తుంది. అయితే టీఆర్ఎస్ పక్కా ప్లాన్తో రంగంలోకి దిగడంతోపాటు సిపిఐ మద్దతు కూడగట్టడంతో కాంగ్రెస్ కాస్త టెన్షన్ లో పడింది. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఆర్టీసీ కార్మికుల సమ్మె అధికార పార్టీపై వ్యతిరేకత పెంచటానికి ఒకింత దోహదం చేసింది .
విజయావకాశాలకు లెక్కలు పక్కాగా ఉన్నాయంటున్న టీఆర్ఎస్ నాయకులు
టిఆర్ఎస్ పార్టీకి హుజూర్ నగర్ ఉప పోరులో గెలుపు అంత ఈజీ కాదని ప్రతిపక్ష పార్టీలు భావిస్తుంటే హుజూర్ నగర్ ఉపపోరులో సీపీఐ మద్దతు లేకున్నా సరే ఇక్కడ గులాబీ జెండా రెపరెపలాడటం ఖాయమేనంటున్నారు గులాబీ దళం.ఆర్టీసీ సమ్మెను సాకుగా చూపి టీఆర్ఎస్ పార్టీకి సిపిఐ మద్దతు ఉపసంహరించుకుంటే టిఆర్ఎస్ పార్టీ ఓటమి పాలు అవుతుందని ప్రతిపక్షాలు వేస్తున్న లెక్కలు తప్పు అంటున్నారు. అందుకు గులాబీ బాస్ ఆయన లెక్కలు ఆయన చెబుతున్నారని సమాచారం.
కాంగ్రెస్ ఒంటరి పోరాటమే తమకు లాభిస్తుందని ధీమా
ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్ నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. అయితే గత ఎన్నికల్లో మహా కూటమి పొత్తులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించారు. కానీ ఆయనఒంటరిపోరులో గెలవలేదని గుర్తు చేస్తున్నారు గులాబీ పార్టీ నాయకులు . అప్పుడు టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీల మద్దతుతో బరిలోకి దిగి విజయం సాధించారు. ఇప్పుడు కాంగ్రెస్ కు ఈ పార్టీలు ఏవీ మద్దతు ప్రకటించడం లేదు. అంతేకాదు అప్పుడు కాంగ్రెస్తో జతకట్టిన పార్టీ అయిన టిడిపి కూడా ఈ సారి బరిలోకి దిగడం కాంగ్రెస్ పార్టీకి మైనస్గా మారింది.
పార్టీని బలోపేతం చేసిన కేటీఆర్ వ్యూహమే కారణం
ఇక గత ఎన్నికల ఫలితాలను చూస్తే టీఆర్ఎస్ కేవలం 7 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలైంది. అయితే ప్రస్తుతం నియోజకవర్గంలో టీఆర్ఎస్ బాగానే పుంజుకున్న ట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హుజూర్ నగర్ నియోజకవర్గం పై దృష్టి సారించి పార్టీని బలోపేతం చేయడానికి పని చేశారు. దీంతో అప్పటి కంటే ఎక్కువ క్యాడర్ నిర్మాణం జరిగింది. అదే సమయంలో ఇటీవల ఇతర పార్టీలకు చెందిన నేతలు, గ్రామ సర్పంచ్లు టీఆర్ఎస్ పుచ్చుకున్నారు. అయితే గతంలో మద్దతు తెల్పిన టీడీపీ ఈ సారి అభ్యర్థిని రంగంలోకి దించడం, ఇక కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్కు మద్దతు ప్రకటించకపోవడం, బిజెపి సైతం పోటాపోటీగా ప్రచారం చేయడం.. ఇవన్నీ తమకే లభిస్తాయని భావిస్తోంది టిఆర్ఎస్ పార్టీ .
ప్రత్యర్ధి ఓటు బ్యాంకు తప్పక చీలుతుందన్న అంచనాలో టీఆర్ఎస్
టీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు ఎలాంటిప్రమాదం లేదని , ప్రత్యర్థి కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని లెక్కలు వేస్తోంది. ఇక ఈ నేపథ్యంలో సీపీఐ యూటర్న్ తీసుకున్నా టిఆర్ఎస్ పార్టీకి పెద్దగా నష్టం ఏమీ లేదని విజయం తమదేనని ధీమాతో ఉన్నట్లుగా పార్టీ శ్రేణులు చెప్తున్నారు. అధికార పార్టీ గా ఉండడం, మంత్రులు ప్రచారం నిర్వహించడం, కేటీఆర్ రోడ్ షో లు చేయడం, కెసిఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించడం ఇలా ప్రతి ఒక్క అంశం తమకు కలిసొస్తుందని గులాబీ పార్టీ శ్రేణులు ధీమాతో ఉన్నాయి. చూడాలి మరి హుజూర్ నగర్ ఉప పోరు ఏ పార్టీకి లాభం చేస్తుందో ? ఏ పార్టీని నిండా ముంచుతుందో ?