తెలంగాణలో మరో నోటిఫికేషన్ విడుదల: 23 పోస్టులకు అప్లై చేయండి
హైదరాబాద్: తెలంగాణలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారి పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 23 పోస్టులను భర్తీ చేయనుంది.
సెప్టెంబర్ 13వ తేదీ నుంచి అక్టోబర్ 10 తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్పీఎస్సీ పేర్కొంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ సంప్రదించాలని కోరింది.
1540 ఏఈఈ పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్
రాష్ట్రంలోని పలు విభాగాల్లో 1540 సహాయక ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, అగ్రికల్చర్ విభాగాల్లో ఇంజినీరింగ్ లేదా తత్సమాన అర్హత కలిగిన అభ్యర్థులతో ఈ ఉద్యోగులను భర్తీ చేయనుంది.
ఈ ప్రకటనలో అత్యధికంగా సివిల్ ఇంజినీరింగ్ పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్ సూచించారు. పోస్టుల వారీగా పూర్తి వివరాలు, వాటికి సంబంధించిన విద్యార్హతలను సెప్టెంబర్ 15న కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి సంబంధిత (సివిల్ ఇంజినీరింగ్/మెకానికల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/అగ్రికల్చర్ ఇంజినీరింగ్ తదితర) విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
జులై 1, 2022వ తేదీ నాటికి 18 నుంచి 44 యేళ్ల మధ్య వయసు ఉండాలి. ఈ అర్హతలున్నవారు అక్టోబర్ 14, 2022వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులు సెప్టెంబర్ 22, 2022 నుంచి ప్రారంభమవుతాయి. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.54,220ల నుంచి రూ.1,33,630ల వరకు జీతంగా చెల్లిస్తారు.