tsrtc strike:ఆర్టీసీ జేఏసీ చివరి అస్త్రం, కేంద్రం దృష్టికి సమస్య, జేఏసీ నేతల భేటీ
ఆర్టీసీ ప్రైవేటీకరణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశమయ్యారు. ఎంప్లాయూస్ యూనియన్ కార్యాలయంలో భేటీ.. భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చిస్తున్నారు. విధుల్లో చేరేందుకు సిద్ధమని ప్రకటించినా.. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఏం చేయాలనే అంశంపై డిస్కష్ చేస్తున్నారు.
ఏం చేద్దాం..
జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, సుధ తదితరులు సమావేశమయ్యారు. భేటీకి తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం, తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, కమ్యూనిస్ట్ నేతలు తమ్మినేని వీరభద్రం, పోటు రంగారావు హాజరయ్యారు. ఆర్టీసీ సమ్మెపై విరమించి విధుల్లోకి వస్తామని చెబుతున్నా... ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై డిస్కషన్ చేస్తున్నారు.
విధుల్లో చేరతామని చెప్పినా..
ఆర్టీసీ కార్మికుల గత 52 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. 26 డిమాండ్ల కోసం పట్టుబట్టారు. అయితే ప్రభుత్వం దిగిరాకపోవడంతో.. అక్టోబర్ 5కు ముందు మాదిరిగా డ్యూటీలో చేరతామని.. ఎలాంటి ఆంక్షలకు అంగీకరించబోమని ఇటీవల జేఏసీ మీడియా ముఖంగా తెలిపింది. తర్వాత ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించిన.. సమ్మెపై నిర్ణయం వెల్లడించలేదు. దీంతో కార్మికులు తమ సమ్మెను కొనసాగిస్తూనే.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు వ్యుహం అనుసరిస్తున్నారు.
సర్కార్కు బూస్ట్..
కార్మికుల సమ్మె అక్రమమని హైకోర్టు చెప్పడం.. రూట్ల ప్రైవేటీకరణకు అనుమతి ఇవ్వడంతో ప్రభుత్వం సానుకూలంగా మారింది. దీంతో కార్మికుల డిమాండ్లను పట్టించుకోవడం లేదు. ఇప్పటికే కేసీఆర్ రెండు పర్యాయాలు అవకాశం ఇచ్చారని ఆర్టీసీ అధికారులు గుర్తుచేస్తున్నారు. కానీ కార్మికులు మాత్రం విధుల్లో చేరేందుకు సంసిద్ధంగా ఉన్నారు.
కేంద్రం దృష్టికి..
విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించినా.. ప్రభుత్వం నుంచి స్పందన లభించకపోవడంతో ఏం చేయాలనే అంశంపై ఆర్టీసీ జేఏసీ నేతలు డిస్కస్ చేస్తున్నారు. తమ సమస్యను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తోంది. గత 52 రోజుల నుంచి సమ్మె చేస్తున్న పట్టించుకోవడం లేదని వాదన వినిపిస్తామని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోనైనా కేసీఆర్ సర్కార్ దిగి వస్తుందని ఆర్టీసీ జేఏసీ నేతలు భావిస్తున్నారు.
రోడ్డునపడ్డ కుటుంబాలు
ఆర్టీసీ సమ్మెతో దాదాపు 20 మంది పైచిలుకు కార్మికులు చనిపోయారు. ఆ కుటుంబాలు రోడ్డునపడ్డాయి. వేలాది కుటుంబాలు ఆర్థిక ఇబ్బంది పడుతున్నాయి. గత మూడునెలల నుంచి జీతం లేక అవస్తలు పడుతున్నారు. సెప్టెంబర్ నెల సాలరీ కూడా ఇవ్వలేదని గుర్తుచేస్తున్నారు.