ఉరేసుకొని చస్తాం కానీ అలా చేయం, కేసీఆర్ తల్లడిల్లారు: తుమ్మల
ఖమ్మం: తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. గత పాలకులు తెలంగాణ రైతుల గురించి పట్టించుకోలేదని ఆయన గురువారం ఆరోపించారు.
అటువంటి వారు రైతుల కోసం అంటూ పాదయాత్ర చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేసీఆర్ సర్కారు చేస్తోన్న అభివృద్ధిని చూసి విపక్షాల జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. అందుకే తమపై విమర్శలు చేస్తున్నాయని అన్నారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా రైతులకు విత్తనాలు, ఎరువులు అందించామన్నారు.
రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తల్లడిల్లారన్నారు. 24 గంటలూ విద్యుత్ ను అందిస్తున్నామన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధే లక్ష్యంగా తమ సర్కారు పని చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలకు తాము ఎన్నడూ ద్రోహం చేయబోమని, వారికి నష్టం కలిగించే పరిస్థితే వస్తే ఉరివేసుకుని చస్తామన్నారు.
కానీ అటువంటి పనులు మాత్రం చేయమని చెప్పారు. తమ సర్కారు చేపడుతోన్న పథకాలు చూసి విపక్షాలు ఓర్చుకోలేకపోతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ కంటే మెరుగ్గా కేంద్రంతో తెలంగాణ సత్సంబంధాలు కొనసాగిస్తోందని చెప్పారు.