విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ. లక్షల మోసం: అరెస్ట్, 19నకిలీ పాస్పోర్టులు సీజ్(ఫొటోలు)
హైదరాబాద్: విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను చాదర్ఘాట్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుల్తాన్బజార్ డివిజన్ ఏసిపి రావుల గిరిధర్ ఈ మేరకు వివరాలను వెల్లడించారు.
మాదన్నపేట శ్రీనగర్ కాలనీకి చెందిన మహ్మద్ అబ్దుల్ గఫూర్, అతడి బావమరిది సయ్యద్ ముక్రమ్, ముంబైకి చెందిన షకీల్ షేక్ ఓ ముఠాగా ఏర్పడ్డారు. విదేశాల్లో ఉద్యోగం చేసేందుకు వెళ్లాలనుకునే యువకులకు జాబ్ వీసా ఇప్పిస్తామని మాయమాటలు చెప్తారు. వారిని సంప్రదించిన యువకుల నుంచి ముందుగా రూ. 10వేల నుంచి 20వేల వరకు వసూలు చేస్తారు.
జాబ్ వీసా జారీ కాగానే రూ. 1.50లక్షలు ఇవ్వాలని కండిషన్ విధిస్తారు. వసూలు చేసిన డబ్బులు బ్యాంకులో వేయగానే షకీల్ షేక్ సగం తీసుకుని మిగతా సగం అబ్దుల్ గఫూర్, సయ్యద్ ముక్రమ్ తీసుకుంటారు.
మలక్పేట ప్రాంత నివాసి మహ్మద్ సోహెయిల్ అహ్మద్ తోపాటు మరో నలుగురు యువకులు బ్రూనే, మలేషియా, సౌదీ అరేబియాలో ఉద్యోగం చేసేందుకు జాబ్ వీసా కోసం రూ. 4.30లక్షలు చెల్లించారు. డబ్బులు చెల్లించినా వీసా రాకపోవడంతో వారిని నిలదీశారు. దీంతో నకిలీ వీసా పత్రాలను అబ్దుల్ గఫూర్, సయ్యద్ ముక్రమ్ అందజేశారు.
కాగా, వాటిని పరిశీలించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు నకిలీవని ధృవీకరించడంతో.. తాము మోసపోయామని గుర్తించిన బాధితులు, చాదర్ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అబ్దుల్ గఫూర్, సయ్యద్ ముక్రమ్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. విదేశాల్లో ఉద్యోగం చేసేందుకు జాబ్ వీసాలు ఇప్పిస్తామని 29మంది నుంచి 11.20లక్షలు వసూలు చేసినట్లు నిందితులు పోలీసులకు తెలిపారు.
నిందితుల నుంచి 19 నకిలీ పాస్ పోర్టులు, కంప్యూటర్, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మోసానికి ప్లాన్ వేసే షకీల్ మాత్రం పరారీలో ఉన్నాడని ఏసిపి వివరించారు. మోసపోయిన వారు ఇంకా ఎవరైనా ఉంటే చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చని అన్నారు.
కాగా, మోసగాళ్లను పట్టుకోవడంలో ప్రత్యేక చొరవ చూపిన చాదర్ఘాట్ ఇన్స్పెక్టర్ సత్తయ్య, డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ దీరావత్ హుస్సేన్, క్రైం ఎస్ఐ అమర్, ఏఎస్ఐ శంకర్, కానిస్టేబుల్ షఫీయుద్దీన్, ప్రకాష్కు రివార్డులు అందించేందుకు తూర్పు మండలం డిసిపికి సిఫార్సు చేస్తామని ఏసిపి గిరిధర్ తెలిపారు.