ప్రకాశంలో రోడ్డు ప్రమాదం: సిద్దిపేట బాబాయ్, అబ్బాయ్ మృతి
సిద్దిపేట: ఆగి ఉన్న బోరు లారీని ఓ కారు ఢీకొన్న సంఘటనలో సిద్దిపేటకు చెందిన ఇద్దరు దుర్మరణం చెందగా, నలుగురు గాయపడ్డ సంఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం చౌటపల్లి వద్ద బుధవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది.
సిద్ధిపేటకు చెందిన రవికుమార్ తన కుటుంబ సభ్యులు మరో ఐదుగురితో కలసి నెల్లూరు జిల్లా కావలి మండలం బొట్టదిన్నె గ్రామంలోని అంకాలమ్మ దర్శనానికి వచ్చారు. అమ్మవారికి మొక్కులు చెల్లించాక తిరిగి సిద్ధిపేట బయలుదేరారు.
రవి కుమార్తో పాటు అతని భార్య రాజేశ్వరి, తనయులు నవీన్, సృజన్, రవి కుమార్ సోదరుడు సుధాకర్, అతడి భార్య శ్రీలక్ష్మి కలిసి తిరిగి కారులోనే బయలుదేరారు.
రవి కుమార్ స్వయంగా కారు నడుపుతున్నారు. బుధవారం ఉదయం చౌటపల్లి చేరుకున్నారు. అక్కడ రోడ్డు పక్కన ఆగి ఉన్న బోరు లారీని వెనుకగా వీరి వాహనం ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న రవి కుమార్ సోదరుడు సుధాకర్ (36), కుమారుడు సంజన్ కుమార్ (12) మృతి చెందారు.
మరో వ్యక్తి నవీన్ కుమార్కు గాయాలయ్యాయి. రవి కుమార్, రాజేశ్వరి, శ్రీలక్ష్మిలకు కూడా గాయాలయ్యాయి. స్థానికులు 108కి సమాచారం అందించారు. వెంటనే వారిని ఒంగోలులోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకున్నారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం చోటుచేసుకుందని భావిస్తున్నారు. మృతుడు సంజన్ కుమార్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. లారీ కింద కారు ఇరుక్కుపోయి నుజ్జవ్వడంతో జేసీబీ సాయంతో వాహనాన్ని వెనక్కు లాగి, అతి కష్టం మీద మృతదేహలను బయటకు తీశారు. గతంలో వీరి కుటుంబ పెద్దలు బొట్లదిన్నెలో ఉండేవారు. అనంతరం సిద్ధిపేటలో స్థిరపడ్డారు.