మహిళలను చంపేసి శవాలను కాల్చేశారు: సెక్స్ వర్కర్లుగా అనుమానం
హైదరాబాద్: హైదరాబాదు సమీపంలో గల రంగారెడ్డి జిల్లాలోని జవహర్నగర్లో జంట హత్యలు స్థానికంగా తీవ్ర సంచలనం రేపాయి. ఇద్దరు మహిళలను చంపేసి, వారి శరీరాలను కాల్చేశారు. మహిళల మృతదేహాలు సగం కాలిపోయాయి. వారిని సెక్స్వర్కర్లుగా అనుమానిస్తున్నారు.
దుండగులు గొంతుకోసి మహిళలను దారుణంగా హత్యచేశారు. కౌకూర్ గ్రామంలోని వెంకూష ఎస్టేట్ పక్కనున్న ఖాళీ ప్రదేశంలో మహిళల మృతదేహాలను గమనించి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ హత్యలకు పాత కక్షలే కారణమని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.
స్థానికంగా ఉండే చిన్నారులు క్రికెట్ ఆడుతుండగా బంతి మహిళల మృతదేహాల వద్ద పడింది. దీంతో ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారంతో డీసీపీ రామచంద్రారెడ్డి, అల్వాల్ ఏసీపీ రఫీక్ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతులెవరనే వివరాలతో పాటు, హత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదిలావుంటే, హైదరాబాద్ నగర శివారులోని హయతనగర్లో గొలుసు చోరీ జరిగింది. లెక్చరర్స్ కాలనీలో ఓ దుండగుడు నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి మూడున్నర తులాల బంగారు గొలుసును లాక్కుని పరారయ్యాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దొంగ కోసం గాలిస్తున్నారు.