కెసిఆర్, చంద్రబాబు మధ్య రాజీ: మధ్యవర్తులు ఆ ఇద్దరు?
హైదరాబాద్: అనూహ్యమైన రీతిలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మధ్య స్నేహపూర్వక వాతావరణం చోటు చేసుకుంది. అమరావతి శంకుస్థాపనకు చంద్రబాబు కెసిఆర్ను ఆహ్వానించిన తీరు చాలా మందిని ఆశ్చర్యపరిచింది కూడా. అదే ఇరువురి మధ్య సయోధ్యకు కారణమైంది.
అంతకు ముందు చంద్రబాబు కెసిఆర్పై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి కూర్చుని మాట్లాడుకుందామంటే కెసిఆర్ ముందుకు రావడం లేదంటూ ఆయన పదే పదే విమర్శలు చేస్తూ వచ్చారు. హైదరాబాదును తానే అభివృద్ధి చేశానని చెబుకుంటూ వచ్చారు. ఈ వ్యాఖ్యలపై కెసిఆర్ కూడా తీవ్రంగా ప్రతిస్పందించారు. అయితే, తనకు పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రిగా చంద్రబాబు తనకు సమానమైన గౌరవం ఇవ్వడం లేదనే అభిప్రాయాన్ని కెసిఆర్ నర్మగర్భితంగా చాలా సార్లు, నేరుగా కొన్ని సార్లు వ్యక్తం చేస్తూ వచ్చారు.
పలు విషయాల్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం సాగుతూ వచ్చింది. అయితే, ఇరువురి మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంటే మంచిదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పదే పదే చెబుతూ వచ్చారు. కానీ, ఇరువురి మధ్య స్నేహపూర్వక వాతావరణం చోటు చేసుకోవడానికి ఇరువురు కేంద్ర మంత్రులు కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నారు. ఒకరు తెలంగాణకు చెందినవారు కాగా, మరొకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు.

తెలంగాణ నుంచి బండారు దత్తాత్రేయ, ఆంధ్రప్రదేశ్ నుంచి సుజనా చౌదరి కెసిఆర్, చంద్రబాబుల మధ్య స్నేహపూర్వక వాతావరణం కల్పించడానికి మధ్యవర్తులుగా వ్యవహరించినట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే చంద్రబాబు కెసిఆర్తో సయోధ్యకు, స్నేహపూర్వక వాతావరణ కల్పనకు అంగీకరించారని అంటున్నారు.
ఒక రాష్ట్రం ముఖ్యమంత్రిగా తనకు గౌరవం ఇవ్వాలనే కెసిఆర్ మాటల్లోని ఆంతర్యాన్ని పసిగట్టిన వారిద్దరు చంద్రబాబును మెతకబరిచినట్లు చెబుతున్నారు. అందువల్లనే చంద్రబాబు స్వయంగా అపాయింట్మెంట్ కోరి, కెసిఆర్ను కలిసి ఆహ్వానపత్రం అందించారని, కెసిఆర్కు గౌరవమర్యాదల్లో ఏ విధమైన పొరపాటు జరగకుండా చూడాలని ఎపి అధికారులను ఆదేశించారని అంటున్నారు.
ప్రస్తుత వాతావరణంలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలు, ఎంసెట్ వివాదం, పదో షెడ్యూల్లోని అంశాలపై నెలకొన్న వివాదాలు సామరస్యపూర్వక వాతావరణంలో పరిష్కారమవుతాయని భావిస్తున్నారు. చంద్రబాబు హైదరాబాదులో ఎక్కువ కాలం ఉంటే సమస్యలు తప్పవని కెసిఆర్ భావిస్తూ వచ్చారు. ఈ స్థితిలో ఓటుకు నోటు కేసు ముందుకు వచ్చింది.
ఆ తర్వాతనే చంద్రబాబు ఎక్కువగా విజయవాడలో క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని, ఎపిలోనే ఎక్కువ కాలం ఉంటూ వస్తున్నారు. ఇది ఒక రకంగా కెసిఆర్కు ఊరట. హైదరాబాదుపై తెలుగుదేశం పార్టీ సమాన హక్కును అడగడం కెసిఆర్కు మింగుడు పడలేదు. ఇక ఆ పరిస్థితి లేదని కెసిఆర్కు అర్థమైంది. చంద్రబాబు కూడా కాస్తా మెతకబడ్డారని, అది కెసిఆర్కు కలిసి వచ్చిందని అంటున్నారు.
అమరావతికి వస్తున్న కెసిఆర్కు ఎక్కడా ఏ విధమైన ఇబ్బంది ఎదురు కాకుండా చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లున్నారు. కెసిఆర్ తమ ఆత్మీయ అతిథి అని కూడా ఆయన అన్నారు. కెసిఆర్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అమరావతి శంకుస్థాపన కార్యక్రమాల ఏర్పాట్ల ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.












Click it and Unblock the Notifications