గుడి మైకులు కట్టబోతే... ఊహించని విషాదం; ముగ్గురు మృతితో ఘొల్లుమన్న గ్రామం
మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం అందనాలపాడు గ్రామంలో రామాలయానికి మైకులు కడుతున్న క్రమంలో విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు మృత్యువాత పడిన సంఘటన గ్రామాన్ని విషాదంలో ముంచింది. ఊహించని ఈ పరిణామానికి గ్రామస్తులంతా కన్నీరుమున్నీరయ్యారు. ఊరంతా ఒక్కసారిగా ఘొల్లుమంది.
గుడి మైకులు సరి చెయ్యాలని ప్రయత్నం చేసిన ముగ్గురు గ్రామస్తులు
అసలేం జరిగిందంటే అందనాల పాడు గ్రామంలో గ్రామ కూడళ్లలో అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అక్కడ పక్కనే ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో దుంపల సుబ్బారావు, మిర్యాల మస్తాన్ రావు, గొర్రె వెంకయ్య రామాలయం తాలూకు కట్టిన మైక్ లను సరి చేస్తున్నారు. ఇనుప స్తంభానికి అమర్చి మైకు సరిగా పనిచేయడం లేదని కొంచెం ఎత్తులో వాటిని కడితే భక్తి గీతాలు, ఇతర గ్రామానికి సంబంధించిన సమాచారం గ్రామంలో వినిపిస్తుందని వారి భావించారు.
6.3 కె.వి సామర్థ్యం కలిగిన విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి
అయితే అక్కడ పైన ఉన్న 6.3 కె.వి సామర్థ్యం కలిగిన విద్యుత్ తీగలను వారు గమనించలేదు. పని చేస్తున్న క్రమంలో విద్యుత్ తీగలకు స్థంభం తగిలి విద్యుదాఘాతానికి గురై స్తంభానికి అలాగే ఉండిపోయారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి వారిని రక్షిస్తామని ప్రయత్నం చేసినా , అప్పటికే వారి శరీర భాగాలు కాలిపోయాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో మూడు కుటుంబాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుడి మైక్ లు కట్టడానికి వెళితే ప్రాణాలే కోల్పోయారని బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి సత్యవతి రాథోడ్
గ్రామంలో మంచి పని చేయబోయి అర్ధాంతరంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇక ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక తో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి సత్యవతి రాథోడ్ వారి కుటుంబాలకు అండగా ఉండాలని సూచించారు.