ప్రధాని సభలో సీఎం కేసీఆర్ కు 7 నిమిషాల సమయం: ఏం జరుగుతోంది..!!
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. ప్రధాని పాల్గొనే సభకు సీఎం కేసీఆర్ కు ప్రాటోకాల్ మేరకు ఆహ్వానం అందింది. ప్రధాని సభలో కేసీఆర్ ప్రసంగం కోసం ఏడు నిమిషాలు సమయం కేటాయించారు. ఈ మేరకు తాజాగా షెడ్యూల్ లో మార్పు చేసారు. కొంత కాలంగా ప్రధాని మోదీ నిర్ణయాలను విభేదిస్తున్న సీఎం కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. ప్రధాని పర్యటనల్లోనూ పాల్గొనటం లేదు. ఇప్పుడు ప్రధాని సభలో కేసీఆర్ కు సమయం కేటాయించారు. మరి..ముఖ్యమంత్రి ఏం చేయబోతున్నారు. హాజరవుతారా. లేక మంత్రిని పంపుతారా. ఏం జరుగుతోంది.
హైదరాబాద్ లో ప్రధాని మోదీ : ప్రధాని మోదీ రేపు (శనివారం) హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. కేవలం రెండు గంటలు ప్రధాని పర్యటన సాగనుంది. ఉదయం 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేటకు ప్రధాని చేరుకుంటారు. అక్కడ నుంచి 11.45కు రోడ్డు మార్గాన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు ప్రధాని చేరుకోనున్నారు. 11.45 నుంచి 12 గంటల దాకా అక్కడే తిరుపతి - సికింద్రాబాద్ వందేభారత్ ప్రారంభిస్తారు. అనంతరం సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. మూడు నెలల కాలంలోనే రెండో వందేభారత్ ను ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించనున్నారు. ప్రధాని కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రులు, గవర్నర్ తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానం అందింది.

సీఎం కేసీఆర్ కు ఆహ్వానం : ప్రధాని పర్యటన వేళ సీఎం కేసీఆర్ హాజరు పై మరోసారి చర్చ మొదలైంది. ఇదే సమయంలో ప్రోటోకాల్ మేరకు సీఎం కేసీఆర్ కు ఆహ్వానం అందింది. పరేడ్గ్రౌండ్స్లో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొనే బహిరంగసభలో సీఎం కేసీఆర్ ప్రసంగం కోసం ఏడు నిమిషాలు కేటాయించారు. ఈ మేరకు అధికారికంగా షెడ్యూల్ ఖరారు అయింది. మధ్యాహ్నం 12.15 గంటలకు పరేడ్గ్రౌండ్స్కు ప్రధాని చేరుకుంటారు. సభ లో 12.20 నుంచి 12.30 గంటల వరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్ర పర్యాటక మంత్రి కిషన్రెడ్డి ప్రసంగాలు ఉంటాయి. ఆ తరువాత 12.30 నుంచి 12.37 గంటల దాకా సీఎం కేసీఆర్ ప్రసంగం ఉండేలా షెడ్యూల్ ఖరారు చేసారు. ఆ తరువాత 12.37 నుంచి 12.50 గంటల వరకు ఎంఎంటీఎస్ ఫేజ్-2తోపాటు పలు రైల్వే, రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉంటాయి. మధ్యాహ్నం 12.50 నుంచి 1.20 వరకు ప్రధాని మోదీ ప్రసంగం ఉండేలా షెడ్యూల్ ఖరారు చేసారు.

ముఖ్యమంత్రి హాజరవుతారా : కొంత కాలంగా ప్రధాని రాష్ట్ర పర్యటనలు..ప్రభుత్వ కార్యక్రమాలకు సైతం సీఎం కేసీఆర్ హాజరు కావటం లేదు. ప్రధాని హైదరాబాద్ వచ్చిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి తలసాని స్వాగతం పలుకుతున్నారు. 8వ తేదీ పర్యటనలో భాగంగా జరిగే సభలో కేసీఆర్ కు ఏడు నిమిషాల సమయం కేటాయించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు పైన చర్చ మొదలైంది. సీఎం హాజరవుతారా లేక తన మంత్రిని ప్రభుత్వ ప్రతినిధిగా పంపుతారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. స్వాగతం పలికేందుకు తలసానికి బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే బీఆర్ఎస్ సింగరేణి ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ప్రధాని పర్యటన వేళ నిరసనలకు పిలుపునిచ్చింది. ఇక, ఇప్పుడు సీఎం ప్రసంగానికి సమయం కేటాయించటం..ఆహ్వానించటంతో ఏం జరుగుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications