మెట్రోతో ఇబ్బందే: గణేష్ విగ్రహాల ఎత్తు తగ్గింపు, కసరత్తులు మొదలు
హైదరాబాద్: నగరంలో పండగల సందడి మొదలైంది. ఒకే నెలలో వినాయక చవితి, బక్రీద్ రావడంతో నిర్వహణకు జీహెచ్ఎంసీ, పోలీసుశాఖలు భారీ ఎత్తున కసరత్తు ప్రారంభించాయి. పండగల ఏర్పాట్లు, నిర్వహణపై బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బల్దియా, పోలీసుశాఖ అధికారులు సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు.
నగరంలో మెట్రో పనులు జరుగుతున్న నేపథ్యంలో వినాయక విగ్రహాల ఎత్తు విషయంలో అధికారులు, పోలీసులు.. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నేతలతో చర్చలు జరిపారు. మెట్రో పనులు జరుగుతున్నందున విగ్రహాల ఎత్తును కొంత తగ్గించుకోవాలని కోరారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే విగ్రహాలు ఎత్తు తక్కువగా ఉండటమే మంచిదని పేర్కొన్నారు. ఇందుకు సమితి నేతలు కూడా సానుకూలంగా స్పందించారు.
కాగా, గణేష్ శోభాయాత్రల సందర్భంగా రద్దీ నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు బల్దియా, పోలీసు అధికారులు తెలిపారు. పోలీసుశాఖతోపాటు ఆర్అండ్బీ, జలమండలి, విద్యుత్తు, నీటి పారుదలశాఖ అధికారులను కలుపుకుంటేనే పండగను అనుకున్నట్లు పూర్తిచేయగలమన్న ఏకాభిప్రాయం వ్యక్తమైంది.
సెప్టెంబరు 9 నుంచి 13వ తేదీ వరకు భారీసంఖ్యలో విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని, శోభాయాత్ర పొడవునా భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామని బల్దియా కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్రెడ్డి తెలిపారు. నగర సీపీ మహేందర్రెడ్డి, రాచకొండ సీపీ మహేష్భగవత్ తదితర ఉన్నతాధికారులు మాట్లాడుతూ... రెండు పండగలు ఒకేసారి వస్తున్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమన్వయంతో పనిచేయాల్సి ఉందని తమ అధికారులకు సూచించారు.
అందుబాటులో ఉన్న అన్ని సాంకేతిక సమాచార వ్యవస్థలను ఉపయోగించుకోవాలన్నారు. నిమజ్జనానికి 9 ప్రత్యేక కోనేరులను సిద్ధం చేస్తున్నట్లు నీటిపారుదలశాఖ సూపరింటెండెంట్ ఇంజినీరు శేఖర్రెడ్డి తెలిపారు. అదనపు సీపీ జితేందర్, శశిధర్రెడ్డి, డీసీపీలు వెంకటేశ్వరరావు, సత్యనారాయణలతోపాటు జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ రవికిరణ్, శంకరయ్య, కెనడి, జోనల్ కమిషనర్లు శ్రీనివాస్రెడ్డి, గంగాధర్రెడ్డి, ఉప కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
'హుస్సేన్సాగర్లో ట్యాంక్బండ్ వైపు లోతు ఎక్కువగా ఉంది. అక్కడ నిమజ్జనం చేసే విగ్రహాలు సుమారు 11-15 మీటర్ల లోతుకు వెళ్తాయి. వెలికితీయడం సాధ్యం కాదు. ఏటా ట్యాంక్బండ్ వద్ద ఉండే తూము పూర్తిగా పూడిపోతోంది. అందువల్ల ట్యాంక్బండ్కు విగ్రహాలను తగ్గించాలి' అని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు సుభాష్సింగ్ సూచించారు.
అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా చర్యలు
బక్రీద్ను ప్రశాంతంగా జరుపుకొనేలా అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని నగర సీపీ మహేందర్రెడ్డి తెలిపారు. పెద్ద సంఖ్యలో చెక్పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ జంతు రవాణాను అడ్డుకుంటామని, గోవధపై ప్రత్యేక చర్యలు చేపట్టనున్నామని ఆయన అన్నారు.
కేవలం పోలీసు చర్యలతో సమస్యలు పరిష్కారంకావని, ప్రజలు సహకరించి ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. బక్రీద్ 12వ తేదీనకాగా, గణేష్ నిమజ్జనాలు తొమ్మిదో తేదీ నుంచి 15 వరకు కొనసాగుతాయని, ఈ సందర్భంగా అన్ని ప్రార్థన మందిరాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జంతు వధ జరిగే ప్రాంతాల్లో పారిశుద్ధ్య సిబ్బందిని పెంచి వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగిస్తామని బల్దియా కమిషనర్ అన్నారు.
ఎత్తు తగ్గింపు: ముందే ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం
సెప్టెంబర్15న గణేష్ నిమజ్జనంలో ఖైరతాబాద్ వినాయకుడిని ముందే నిమజ్జనం చేయాలని బుధవారం జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి, పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి పాల్గొన్నారు. వినాయక చవితి, బక్రీద్ పండుగలపై సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్15న తొలుత ఖైరతాబాద్ విగ్రహం నిమజ్జనం చేయాలని, ఊరేగింపు ఉదయమే ప్రారంభించాలని నిర్ణయించారు. కాగా, హైకోర్టు సూచనల నేపథ్యంలో 58ఫీట్ల ఎత్తుతో విగ్రహాన్ని రూపొందిస్తున్నట్లు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నేతలు తెలిపారు.
సెప్టెంబర్ 5 నుంచే కంట్రోల్రూం
గణేష్ మండపాల నిర్వాహకులు, భక్తులు, సాధారణ ప్రజలకు పండగకు సంబంధించి ఎలాంటి వివరాలు కావాలన్నా, ఫిర్యాదులున్నా నేరుగా పరిష్కారం చూపేందుకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 5వ తేదీ నుంచే కంట్రోల్ రూం ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.
డీజేలు పెడితే కఠిన చర్యలు
సెప్టెంబర్ 5 నుంచి జరగనున్న గణపతి నవరాత్రులకు ఏర్పాటు చేసే మండపాలకు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని పశ్చిమ సైబరాబాద్ కమిషనర్ నవీన్చంద్ స్పష్టం చేశారు. పోలీస్ అధికారులతో బుధవారం కమిషనరేట్లో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 25 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకుంటామని, దరఖాస్తులను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామన్నారు. పోలీసులు పేర్కొనే ప్రమాణాలకు అనుగుణంగా మండపాలు లేకుంటే అనుమతి ఇవ్వబోమన్నారు. డీజేలకు అనుమతి లేదని, బాక్స్ మాదిరిగా ఉండే లౌడ్స్పీకర్లను మాత్రమే పెట్టాలని సూచించారు.