కరోనా వ్యాప్తిని పటిష్టంగా అడ్డుకోవాలన్న మేయర్.!గ్రేటర్ లో10రోజులపాటు సూపర్ స్ప్రెడర్స్ కు వాక్సినేషన్.!
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన పలు చర్యల్లో భాగంగా సూపర్ స్ప్రెడర్స్ గా గుర్తించిన పది రంగాలకు చెందిన వర్కర్స్ కు నేటి నుండి పది రోజుల పాటు ప్రత్యేక వాక్సినేషన్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. దేశంలోనే తెలంగాణా రాష్ట్రం ఈ విధంగా సూపర్ స్ప్రెడర్స్ ను గుర్తించి ఉచిత వాక్సినేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిందని అన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు మూడు లక్షల మందికి ఈ ఉచిత వాక్సిన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నగరంలోని 30 సర్కిళ్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాలలో ఉదయం నుండి సాయంత్రం 4 గంటల వరకు వాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని మేయర్ తెలిపారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి నిదర్శనం ఈ వాక్సిన్ కార్యక్రమమని మేయర్ ప్రశంసించారు.
ఇప్పటికే లాక్డౌన్ తో నిరుపేదలు ఇబ్బందులు పడవద్దని ఉద్దేశంతో ప్రతీ రోజూ 60 వేల మందికి పైగా ఉచిత అన్నపూర్ణ భోజనం జీహెచ్ఎంసీ ద్వారా అందిస్తున్నామని తెలిపారు.కరోనా బాధితులకు తగు వైద్య సలహాలు, ఇతర సదుపాయాలను కల్పించేందుకు జీహెచ్ఎంసీ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసామని, ఇప్పటికే హైదరాబాద్ నగరంలో దాదాపు 17 లక్షల ఇళ్లల్లో మొదటి విడత ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించి జ్వర లక్షణాలున్న వారికి ఉచితంగా మందుల కిట్ లను అంద చేసామని మేయర్ స్పష్టం చేసారు.
Recommended Video
రెండో విడత ఫీవర్ సర్వే కూడా ప్రారంభం అయిందని, నగరంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ జ్వర పరీక్షలు నిర్వహించి జ్వరం ఉన్నవారికి ఉచితంగా మందుల కిట్ లను అందచేస్తున్నామని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ లోని ముప్పై సర్కిళ్లలో కోవిద్ పాజిటివ్ బాధితులకు ప్రత్యేకంగా ఐసోలేషన్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసామని, దురదృష్టవశాత్తు ఎవరైనా మరణిస్తే వారికి ఏవిధమైన ఆర్థిక భారం లేకుండా ఉండేందుకు ఉచిత అంబులెన్సు ఎర్రపాటు చేయడమే కాకుండా, ఉచితంగా దహన సంస్కారం కూడా జరిపిస్తున్నామని విజయలక్ష్మి తెలిపారు.