సెల్ఫోన్ అమ్మకాలు: చంద్రబాబు దారిలో కెసిఆర్ నడుస్తారా?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సెల్ఫోన్ల పైన వేసే వ్యాట్ 14.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. సెల్ఫోన్లపై వ్యాట్ తగ్గించే విషయమై కెసిఆర్ ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే పక్క రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటకలలో తక్కువగా ఉంది.
విభజన నేపథ్యంలో అపాయింటెడ్ డేట్కు (జూన్ 2014కు ముందు) నెల రోజుల ముందు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెల్ఫోన్ల పైన వ్యాట్ను 5 శాతం చేశారు. అదే వ్యాట్ను చంద్రబాబు ప్రభుత్వం కొనసాగిస్తోంది. తెలంగాణలో మాత్రం దానిని 14.5 శాతానికి పెంచారు.

ఏపీలో 5 శాతం ఉండగా, తెలంగాణలో 14.5 శాతం ఉండటంతో వ్యాపారులు కూడా ఒకింత గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. కొందరు 5 శాతం వ్యాట్తోనే అమ్ముతున్నారు. దీంతో కొన్ని దుకాణాల్లో అవకతవకలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఖమ్మం, నల్గొండ జిల్లాలకు ఏపీలోని విజయవాడ నుంచి ఫోన్లు వస్తున్నట్లుగా అధికారులు గుర్తిస్తున్నారు.
అధికారులు హైదరాబాదులోని సెల్ఫోన్ దుకాణాల పైన దాడులు నిర్వహించడంతో పాటు 14.5 పర్సెంట్ వ్యాట్ విషయమై నోటీసులు కూడా జారీ చేశారు. అయితే, మొబైల్ షాప్ ఓనర్లు, మొబైల్ మర్చంట్ అసోసియేషన్ మాత్రం.. అంత వ్యాట్ చెల్లించేందుకు వినియోగదారులు సుముఖత చూపడం లేదని చెబుతున్నారు. అందుకే తాము కేవలం 5 శాతంకే బిల్లు ఇచ్చినట్లు చెప్పారని తెలుస్తోంది.
సెల్ఫోన్ అమ్మకపు ట్యాక్స్ వల్ల ప్రభుత్వానికి ఏడాదికి దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు సమకూరుతుందని అంచనా. అదే సమయంలో, వ్యాట్ ఎక్కువగా ఉండటంతో వినియోగదారులు ఆన్ లైన్ కొనుగోలు వైపు మొగ్గు చూపుతున్నారు.

చాలా ఈ కామర్స్ వెబ్ సైట్లు 5 శాతం వ్యాట్ వసూలు చేస్తున్నాయి. దుకాణాల్లో మాత్రం 14.5 శాతం వసూలు చేస్తున్నారు. ఇది కూడా వినియోగదారులు దుకాణాలకు మరింత దూరం కావడానికి కారణమవుతోందని అంటున్నారు. ఈ కామర్స్ వెబ్ సైట్లు డిస్కౌంట్లు ఇవ్వడం, ఇంటి నుంచే ఆర్డర్ చేసుకునే వెసులుబాటు ఉండటం లాంటి ఎన్నో ఉండటం కూడా కారణాలుగా చెప్పవచ్చు.
వినియోగదారులు ఎక్కువ ధర కలిగిన ఫోన్లను ఆన్ లైన ద్వారా కొనుగోలు చేసేందుకే మక్కువ చూపిస్తున్నారని అంటున్నారు. తక్కువ ధరవి కొనాల్సి వస్తే మాత్రమే దుకాణాలకు వెళ్తున్నారని అంటున్నారు. ఏపీ, కర్నాటక తదితర రాష్ట్రాల వలె తెలంగాణలో కూడా వ్యాట్ను 5 శాతానికి తగ్గించాలని దుకాణదారులు తెలంగాణ సీఎం కెసిఆర్కు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో వ్యాట్ తగ్గించే విషయం కెసిఆర్ ప్రభుత్వం యోచిస్తోందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications