జగన్ పార్టీకి గుడ్బై: కాంగ్రెసులోకి వనమా
ఖమ్మం: ఖమ్మం జిల్లా కొత్తగూడేనికి చెందిన మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓ నమస్కారం పెట్టేసి ఆయన తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారు. అందుకు అధిష్ఠానం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. కాంగ్రెస్లో వనమా చేరికకు సోమవారం సోనియా గాంధీ అంగీకరించినట్టు సమాచారం.
ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ సిఫార్సులను అధిష్ఠానం ఆమోదించడంతో వనమా తిరిగి సొంత గూటికి చేరుకోవడం ఖాయమైపోయింది. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులో భాగంగా సిపిఐకి టికెట్ కేటాయించడంతో వనమా వెంకటేశ్వర రావుకు కాంగ్రెసు టికెట్ లభించలేదు. దీంతో ఆయన జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరి కొత్తగూడెం అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి మళ్లీ కాంగ్రెస్ గూటికి వెళ్లేందుకు ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నారు.

వనమా వెంకటేశ్వరరావును అప్పట్లో కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. వనమా రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్లోనే కొనసాగారు. కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ను బలోపేతం చేసి మూడుసార్లు ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. దివంగత వైఎస్ హయాంలో వైద్య శాఖ మంత్రిగా పని చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనూ పాలు పంచుకున్నారు.
2009 ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో వైసీపీలో చేరి.. పోటీ చేసి ఓడిపోయారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధికంగా విజయం సాధించడానికి కారకులయ్యారు.












Click it and Unblock the Notifications