హోదాపై వెంకయ్య టార్గెట్: 'రాజీనామా చేస్తే చరిత్ర, పవన్ కళ్యాణ్తో కలవాలి'
హైదరాబాద్/అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదాపై సినీ ప్రముఖులు గళమెత్తుతున్నారు. నటుడు శివాజీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం ఏ స్థాయిలో మాట్లాడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నటుడు మోహన్ బాబు వంటి వారు కూడా మోడీని ప్రశ్నించారు.
ప్రముఖ ఫిలిం మేకర్ బీవీఎస్ రవి కూడా ప్రత్యేక హోదా విషయమై వరుసగా ట్విట్టర్లో గళమెత్తారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. ప్రత్యేక హోదా, ఏపీకి ప్రయోజనాల కోసం ఆయన అప్పుడప్పుడు ట్వీట్లు చేస్తున్నారు.
స్పెషల్ స్టేటస్ మీద చిత్తశుద్ధి ఉంటే
తాజాగా, ఆయన తెలుగువాడు, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును టార్గెట్ చేశారు. నిజంగా స్పెషల్ స్టేటస్ మీద అన్ని పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే హక్కుల సాధనకు ఒక అఖిలపక్షం ఏర్పాటు చేయాలని బీవీఎస్ రవి పేర్కొన్నారు.
తెలంగాణ పోరాటం స్ఫూర్తి
అఖిల పక్షంలో మేధావులను, కేంద్రంతో మాట్లాడటం వచ్చిన వాళ్లను కూడా కలుపుకోవాలని బీవీఎస్ రవి సూచించారు. ఐకమత్యం లేకుండా క్రెడిట్ కోసం పోరాటాలు చేస్తే ఫలితాలు శూన్యమని రాజకీయ పార్టీలపై సెటైర్లు వేశారు. వైయస్ జగన్, పవన్ కళ్యాణ్, సీబీఎన్ తెలంగాణ పోరాటం మనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు.
వెంకయ్య రాజీనామా చేసి లీడ్ చేయాలి
వెంకయ్య నాయుడును ఉద్దేశించి మాట్లాడుతూ.. వెంకయ్య నాయుడు రాజీనామా చేసి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని లీడ్ చేయాలని సూచించారు. మోడీ ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని, కాబట్టి ఇప్పుడు వెంకయ్య.. పవన్ కళ్యాణ్ వెంట ఉండాలన్నారు.
చరిత్రలో నిలిచిపోతారా
వెంకయ్య నాయుడు గారు పవర్లో ఉండాలా లేక చరిత్రలో నిలిచిపోవాలనుకుంటున్నారా అని ట్వీట్ చేశారు. ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చనందుకు రాజీనామా చేసిన తొలి ఉప రాష్ట్రపతిగా నిలిచిపోతారని పేర్కొన్నారు.