చంద్రబాబుని లాగారు: నయీం కేసులో బెల్లి సోదరుడి షాకింగ్, సీసాలు అమ్ముకొని జీవనం
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీంను పెంచి పోషించింది ఉమ్మడి ఏపీ సీఎంగా పని చేసిన చంద్రబాబేనని బెల్లి లలిత సోదరుడు కృష్ణ ఆరోపించినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. నయీం చేతిలో లలిత దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆ హత్య అనంతరం దశాబ్దానికి పైగా అతను అజ్ఞాతంలో ఉన్నారు.
సుమారు 16 ఏళ్లు అజ్ఞాతంలో ఉన్న అతను ఇప్పుడు బయటకు వచ్చారు. నయీం హత్య తదనంతర పరిణామం నేపథ్యంలో బయటకు వచ్చారు. శనివారం కుటుంబ సభ్యులను కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. నయీం తన చెల్లిని, మరో ఇద్దరు కుటుంబ సభ్యులను హతమార్చారని చెప్పారు.

నయీం చనిపోయిన అనంతరం తనకు రక్షణ ఉంటుందన్న ధైర్యంతోనే ఇన్నాళ్లకు బయటకు వచ్చానని ఆయన చెప్పారు. 1999లో తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడం కోసం బెల్లి లలితను అతి కిరాతకంగా చంపించారని ఆరోపించారు.
నాడు హోంమంత్రి ఆదేశాల మేరకు లలితను నయీం హత్య చేయించారని, ఆపై మృతదేహాన్ని పదిహేడు ముక్కలు చేయించారని ఆతను ఆరోపించారని చెబుతున్నారు. తన సోదరి సహా మరికొందరు హత్యకు గురి కావడంతో తాను ప్రాణ భయంతో అజ్ఞాతంలోకి వెళ్లానని చెప్పారు. తన సోదరి హత్య, మిగతా కుటుంబ సభ్యుల హత్యల పైన సుప్రీంకోర్టు చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
తాను ఏడాది పాటు తెలంగాణ బయట తిరిగానని, ఆ తర్వాత హైదరాబాదులోనే సీసాలు ఏరుకుంటూ బతికానని చెప్పారు. తన కుటుంబ సభ్యుల హత్య కేసులకు సంబంధించిన వివరాలు సిట్కు అందిస్తానని చెప్పారు. నయీం అనుచరాలు ఇంకా చాలామంది దర్జాగా తిరుగుతున్నారన్నారు. నయీం కుటుంబమంతా నరరూప రాక్షసులే అన్నారు.












Click it and Unblock the Notifications