ఎంతమంది పీకేలొచ్చినా బీజేపీ విజయాన్ని ఆపలేరు: కేసీఆర్కు భయం పట్టుకుందంటూ విజయశాంతి ఫైర్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు బీజేపీ సీనియర్ నేత విజయశాంతి. పేదలకు చెందాల్సిన డబుల్ బెడ్రూం ఇండ్లను కొందరు టీఆర్ఎస్ లీడర్లు బేరం పెట్టి దందా చేస్తున్నారని ఆరోపించారు. లక్ష, రెండు లక్షల చొప్పున వసూలు చేసి రాత్రికి రాత్రే లిస్టులు మార్చేస్తున్నారని మండిపడ్డారు విజయశాంతి.
డబుల్ బెడ్రూం ఇల్లు టీఆర్ఎస్ వారికేనంటూ విజయశాంతి ఫైర్
అంతేగాక, పలుచోట్ల ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని, అధికారులపై ఒత్తిడి తెచ్చి తమ పార్టీ నేతలు, కార్యకర్తలు, అనుచరుల పేర్లు చేరుస్తున్నారని విజయశాంతి ఆరోపించారు. తాజాగా వనపర్తి జిల్లా కొత్తకోట మండలం మిరాసిపల్లిలో నిర్మించిన 20 డబుల్ బెడ్రూం ఇండ్లను 3 నెలల కిందట ఎమ్మెల్యే ఆలం వెంకటేశ్వర్ రెడ్డి గ్రామస్తులకు పంపిణీ చేశారు. ఎలాంటి భూమి, జాగ లేకుండా... గుడిసెల్లో ఉండే పేదలను కాదని, అప్పటికే ఇండ్లు ఉన్నవాళ్లకు డబుల్బెడ్రూం ఇండ్లు కేటాయించారు. ఇవి దక్కినవాళ్లలో ఇండ్లు, ఇతర ఆస్తిపాస్తులు ఉన్న గ్రామ సర్పంచ్ తల్లితో పాటు ఎమ్మెల్యే అనుచరులున్నరు. ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష వరకు వసూలు చేశారు. దీనిపై గ్రామానికి చెందిన ఎ.కొండన్న, సి.లక్ష్మయ్య, బోయ ఊశన్న, పి.మన్యం, చంద్రయ్య తదితరులు కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చివరికి బాధితులంతా హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు... రాష్ట్ర హౌసింగ్ సెక్రటరీ, వనపర్తి జిల్లా కలెక్టర్, మిరాసిపల్లి గ్రామ సెక్రటరీకి ఇటీవల నోటీసులు జారీ చేసింది. లబ్ధిదారుల వివరాలతో హాజరు కావాలని ఆదేశించింది అని విజయశాంతి తెలిపారు.
కేసీఆర్ సర్కారుకు గుణపాఠం తప్పదన్న విజయశాంతి
లబ్ధిదారుల వివరాలు పరిశీలించిన అనంతరం... సగం మంది అనర్హులు ఉన్నట్టు తేలడంతో మొత్తం కేటాయింపులు రద్దు చేసి తిరిగి అర్హులను ఎంపిక చేయాలని హైకోర్టు తీర్పు చెప్పింది. అలాగే సీఎం కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేటలోని దుబ్బాక మున్సిపాలిటీ, పెద్దపల్లి జిల్లా మంథని, మహబూబాబాద్, వరంగల్ కార్పొరేషన్లో కూడా అచ్చు గుద్దినట్టు ఇలాంటి ఘటనలే జరిగాయి. అర్హులకు తీవ్ర అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని లబ్దిదారులు హెచ్చరిస్తున్నారని విజయశాంతి అన్నారు.
ఎంతమంది పీకేలొచ్చిన బీజేపీ విజయాన్ని ఆపలేరంటూ విజయశాంతి
రాష్ట్రంలో ఎంతమంది పీకే(ప్రశాంత్ కిషోర్)లు వచ్చినా ఏమీ చెయ్యలేరని విజయశాంతి అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. ఎన్నికల తర్వాత కేసీఆర్ అమెరికాకు బిస్తరు సర్దే ప్రయత్నాలు చేస్తున్నరు. ప్రతి గడ్డపైనా కాషాయ జెండా ఎగరడం ఖాయం. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే టీఆర్ఎస్కు భయమేస్తోంది. కాంగ్రెస్లో ఎవరూ గెలవరు... గెలిచినా ఆ పార్టీలో ఉండరు. టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని విజయశాంతి వ్యాఖ్యానించారు. పీకే టిఫిన్ ప్రగతిభవన్లో... లంచ్ ఢిల్లీ ఏఐసీసీ ఆఫీసులో చేస్తున్నరు. టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే పోటీ చేస్తాయి. రెండు పార్టీలు ఒప్పందం కుదుర్చుకున్నది వాస్తవమని అన్నారు.
బీజేపీకి భయపడే కేసీఆర్.. పీకేని స్ట్రాటజిస్టుగా పెట్టుకున్నరు: విజయశాంతి
టీఆర్ఎస్ను ఎదుర్కునేది బీజేపీ ఒక్కటే. ఒకప్పుడు 2 ఎంపీ స్థానాలున్న బీజేపీ ఇప్పుడు దేశాన్ని ఏలుతున్నది. ప్రస్తుతం ముగ్గురు ఎమ్మెల్యేలతో రాష్ట్రంలో ఉన్నం. త్వరలో రాష్ట్రాన్ని ఏలుతం. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. గ్రామాలకు నిధులిచ్చేది కేంద్ర ప్రభుత్వమే. ప్రతి పైసా మోడీ ఇస్తుంటే... అవి ప్రజలకు దక్కకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. ఏడేండ్లలో సెక్రటేరియట్కు పోని సీఎంగా కేసీఆర్ గిన్నిస్బుక్ రికార్డుల్లోకి ఎక్కడం ఖాయం. బీజేపీకి భయపడే కేసీఆర్ పీకేని స్ట్రాటజిస్టుగా పెట్టుకున్నరు. అన్ని పార్టీలు కలిసి బీజేపీని ఎదుర్కోవడానికి ఎన్నికలకు వస్తున్నయి. 'పేదోళ్లు ఆత్మబలిదానం చేస్తే రాష్ట్రం వచ్చింది. కానీ పెద్దోడు రాజ్యమేలుతున్నడు. గరీబోళ్ల రాజ్యం కోసం బీజేపీ మలిదశ ఉద్యమం మొదలుపెట్టింది. బీజేపీ నాయకత్వంలో గడీలు బద్దలు కొట్టి తెలంగాణ ద్రోహిని తరిమికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నరు అని విజయశాంతి స్పష్టం చేశారు.