భారతదేశాన్ని ఉద్ధరిస్తానంటూ బయల్దేరిన కేసీఆర్ సంక్షేమరాజ్యంలో జరుగుతుందిదే!!
తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని బయలుదేరిన నాటి నుండి కెసిఆర్ ను, బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రాన్ని ఉద్ధరించలేని కేసీఆర్ దేశాన్ని ఉద్ధరిస్తాడా అంటూ పెద్ద ఎత్తున కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ అందుకు అనేక ఉదాహరణలను చూపిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నాయకులు. ముఖ్యంగా బిజెపి నాయకులు కెసిఆర్ బీఆర్ఎస్ కు ఢిల్లీలో వీఆర్ఎస్ ఇవ్వాల్సిందేనని తేల్చి చెబుతున్నారు.
కేసీఆర్ ను మరోమారు టార్గెట్ చేసిన విజయశాంతి
ఇక ఇదే క్రమంలో బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి తెలంగాణ సీఎం కేసీఆర్ ను మరోమారు టార్గెట్ చేశారు. మొన్నటికి మొన్న కెసిఆర్ దత్తత తీసుకున్న గ్రామం వాసాలమర్రి ని పట్టించుకున్న నాథుడే లేడని, వాసాలమర్రి ని బాగు చేయలేని కెసిఆర్ దేశాన్ని ఏం బాగు చేస్తాడు అంటూ విమర్శించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు హాస్టల్ లలో పడుతున్న అగచాట్ల పై కెసిఆర్ ను,బీఆర్ఎస్ పార్టీ ని టార్గెట్ చేసిన విజయశాంతి దేశాన్ని ఉద్దరిస్తాను అంటూ బయలుదేరిన కేసీఆర్ సంక్షేమ రాజ్యంలో విద్యార్థుల దుస్థితి ఇలా ఉందని తీవ్ర విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలో హాస్టల్స్ లో విద్యార్థుల పరిస్థితి ఇలా
విద్యార్థుల భవిష్యత్తును తెలంగాణ ప్రభుత్వం అనారోగ్యం పాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసిన విజయశాంతి బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల అగచాట్లు, ఆందోళనల తర్వాత అయినా ఈ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం పట్ల శ్రద్ధ వహిస్తుందని భావించామని, కానీ అది తప్పని నిరూపించారు అంటూ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ గురుకుల హాస్టళ్లు, సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులు నానా అగచాట్లు పడుతున్నారని, వారి బాధలు వర్ణనాతీతంగా మారాయన్నారు విజయశాంతి.
అనేక హాస్టల్స్ ఘటనలను కళ్ళకు కడుతూ
హాస్టళ్లలో నాసిరకం ఆహారం, అరకొర సదుపాయాలు, తీవ్ర చలికాలంలో చన్నీటి స్నానం, వారికి కనీసం కావలసిన మౌలిక వసతులు లేకపోవడం, తదితర పరిస్థితుల మధ్య కడుపు నొప్పి, వైరల్ ఫీవర్స్, వాంతులతో ఆనారోగ్యం బారిన పడుతున్నారని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్యనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని పడమట నర్సాపురం ఆశ్రమ పాఠశాలకు చెందిన 44 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆ పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా విలవిలలాడిపోయారని విజయశాంతి పేర్కొన్నారు.
కేసీఆర్ సంక్షేమ రాజ్యంలో ఇలానా
కొన్ని చోట్ల వంట, పారిశుద్ధ్య కార్మికుల సమ్మె, పాఠశాల సిబ్బంది సమ్మె కారణంగా టీచర్లు, విద్యార్థులే వంట చేసుకునే పరిస్థితి నెలకొందని తెలంగాణ రాష్ట్రంలో హాస్టళ్ల పరిస్థితి ఈ విధంగా తయారయిందని విజయశాంతి హాస్టళ్లలో విద్యార్థుల పరిస్థితిని కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. భారతదేశాన్ని ఉద్ధరిస్తానంటూ బయల్దేరిన కేసీఆర్ సంక్షేమ రాజ్యంలో ఇదీ విద్యార్థులు ఎదుర్కొంటున్న దుస్థితి అంటూ విజయశాంతి మండిపడ్డారు.
కేసీఆర్ పెద్ద 420.. ఆయనకు ఎవరూ మద్దతివ్వరు
ఇక అంతే కాదు జాతీయ రాజకీయాలు చేస్తానని బయలుదేరిన కేసీఆర్ కు ఎవరూ సహకరించే అవకాశం లేదని విజయశాంతి అభిప్రాయం వ్యక్తం చేశారు. కెసిఆర్ పెద్ద 420 అంటూ విజయశాంతి మండిపడ్డారు. బీఆర్ఎస్ పేరుతో మళ్లీ కొత్త డ్రామాలకు కెసిఆర్ తెర తీశారని విజయశాంతి విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి చెయ్యని కేసీఆర్, ప్రజల సమస్యలను పట్టించుకోని కేసీఆర్, దేశంలో ఏం చేస్తాడో అందరికీ తెలుసన్నారు. ఢిల్లీలో ఆయనను పట్టించుకునేవారే ఉండరని విజయశాంతి అభిప్రాయం వ్యక్తం చేశారు.