మీ రాములమ్మపై వేటెందుకేశారాన్నా?, అందుకే 4ఏళ్లు మాట్లాడలేదు: కేసీఆర్పై విజయశాంతి
గద్వాల: టీఆర్ఎస్ అధ్యక్షుడు, అపద్దర్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ నేత, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం అలంపూర్ నుంచి ఆ పార్టీ ఎన్నికల ప్రచార శంఖారావం సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో ఆమె మాట్లాడారు.
అన్నా.. చెల్లెలికి మధ్య జరిగే యుద్ధం, మేం సిద్ధమే..: కేసీఆర్పై విజయశాంతి
అవన్నీ సంపాదన పథకాలే..
రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్నవి సంక్షేమ పథకాలు కావని, అవి టీఆర్ఎస్ సంపాదన పథకాలని విజయశాంతి ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబం కోసమే తెలంగాణ వచ్చినట్లయిందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా సమాజం మేలుకోవాలన్నారు.
అందుకే నాలుగేళ్లు మాట్లాడలేదు
తాను కేసీఆర్తో కలిసి ఉద్యమాలు చేశానని విజయశాంతి ఈ సందర్భంగా చెప్పారు. తెలంగాణ వస్తే అందరికీ మంచి జరుగుతుందని, ఎన్నో వాగ్ధానాలు ఇచ్చిన కేసీఆర్ను నమ్మి ప్రజలు అధికారం కట్టబెట్టారని తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తారనే ఈ నాలుగేళ్లు తానేమీ మాట్లాడలేదని అన్నారు.
రాములమ్మను ఎందుకు సస్పెండ్ చేశారన్నా..
బడుగు బలహీన వర్గాలకు మంచి చేస్తానని చెప్పిన కేసీఆర్.. ఆ మాట నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. తొమ్మిదో చెల్లెలుగా భావించి నన్ను కడుపులో పెట్టి చూసుకుంటానన్న కేసీఆర్.. పార్టీ నుంచి మీ రాములమ్మను ఎందుకు సస్పెండ్ చేశారన్నా అంటూ విజయశాంతి ప్రశ్నించారు.
కేసీఆర్కు మరో ఐదేళ్లు అవకాశమిస్తే..
కేసీఆర్కు మరో ఐదేళ్లు అవకాశమిస్తే దోచుకుంటారని కాంగ్రెస్ నేత విజయశాంతి విమర్శించారు. ముందస్తు ఎన్నికలకు గల కారణాలను ఇంతవరకు కేసీఆర్ చెప్పలేదని, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని విజయశాంతి ఆరోపించారు.
ఎన్నికల శంఖారావం
అంతకుముందు కాంగ్రెస్ నేతలు బాలబ్రహ్మేశ్వర, జోగులాంబ ఆలయాల్లో పూజలు చేశారు. అనంతరం అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. విజయశాంతితోపాటు ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్రమాజీ మంత్రి జైపాల్రెడ్డి, జానారెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.