సీఎం కేసీఆర్ చెప్తే అసలే చెయ్యరు.. ఆ విషయం అధికారులకు బాగా తెలుసు : విజయశాంతి సెటైర్
బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ ఒక మాట అన్నారంటే, అది కచ్చితంగా జరగదు అంటూ ఆమె ఎద్దేవా చేశారు. వస్తున్నా వస్తున్నా అనడమే తప్ప కేసీఆర్ ఫామ్ హౌస్ ను, ప్రగతి భవన్ ను వదిలి వచ్చిందే లేదని విజయశాంతి పేర్కొన్నారు. ఒక్క ఓట్ల పండగ అప్పుడు మాత్రమే కెసిఆర్ కు ప్రజలు గుర్తొస్తారని విమర్శించారు.
Recommended Video

సీఎం మాటలు చిన్న పిల్లలు కూడా నమ్మే పరిస్థితి లేదు : విజయశాంతి
తాజాగా సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి సమీక్ష సందర్భంగా అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారని, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పనులను తాను స్వయంగా చెక్ చేస్తానని, క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని, స్వయంగా వచ్చి పరిశీలిస్తానని సీఎం కేసీఆర్ చెప్పారని పేర్కొన్న విజయశాంతి అధికారులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. సీఎం కేసీఆర్ మాటలను ఉద్దేశించి తన పనితీరుతో తెలంగాణను ఉద్ధరిస్తా అని చెబితే చిన్న పిల్లలు కూడా నమ్మే పరిస్థితి లేదని విజయశాంతి అభిప్రాయపడ్డారు.

కేసీఆర్ మాటలకు భయపడాల్సిన పని లేదని అధికారులకు తెలుసు
ఆఫీసర్లు అందుబాటులో ఉండి తాను అడిగిన రిపోర్టులను ఇవ్వాలని, తేడా వస్తే స్పాట్లోనే సస్పెన్షన్లు ఉంటాయని సీఎం కేసీఆర్ సీరియస్ గా హెచ్చరించినా ఆయన మాటలకు భయపడాల్సిన పని లేదని అధికారులకు బాగా తెలుసన్నారు. సాగర్ ఎన్నికలప్పుడు 15 రోజుల్లో మళ్లీ నాగార్జునసాగర్ వచ్చి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానన్నారు. నెలన్నర దాటినా అతీగతి లేదని విజయశాంతి వ్యాఖ్యానించారు.అంతకుముందు హుజూర్ నగర్ ఎన్నికలప్పుడు వచ్చి పదిహేను, ఇరవై రోజుల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు వరకు పర్యటించి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని చెప్పిన కెసిఆర్ సారు ఏడాదిన్నర అయినా అడ్రస్ లేడని చురకలంటించారు .

ఆయన చెప్పింది అసలే చెయ్యడు
ఇక చాలా ఏళ్ల కిందట నగర మురికివాడలకు వచ్చి వారికి కొత్త ఇల్లు కట్టి ఇస్తానని దావత్ చేసుకోవడానికి ఐదు నెలల్లో మళ్లీ వస్తానని అన్నారు. ఏం జరిగిందో చెప్పనక్కర్లేదు. ఇక తాజా చెకింగ్ లు, వార్నింగ్ లకు అర్థం ఏంటో నేను చెప్పాల్సిన పని లేదు .ఆయన దర్శనం కావాలంటే మళ్ళీ అక్కడ ఓట్ల పండగ రావాలేమో అంటూ విజయశాంతి ఎద్దేవా చేశారు. ఇక కాదు తప్పదు అనుకుంటే ఏవో కొన్ని చోట్లకి వెళ్లి ముఖం చూపించి తిరిగి రావడమే తప్ప సీఎం కేసీఆర్ చేయగలిగిందేమీ లేదంటూ విజయశాంతి పేర్కొన్నారు.

ఆయన ఎక్కడికి వెళ్ళినా చిత్రవిచిత్ర తిక్క తుగ్లక్ విన్యాసాలు అన్నీ ఆవిష్కృతం
ఎంతోమంది ఉద్యోగాల కోసం, మూడెకరాల భూమి కోసం, డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం, నిర్వాసితులకు పరిహారం కోసం, ధాన్యం కొనుగోలు కాక నష్టపోయిన రైతులు,ఇలా ఎంతోమంది బాధితులు సీఎం గారిని అడ్డుకుంటారో ముందు ముందు తెలుస్తుంది అంటూ విజయశాంతి వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఈ ముఖ్యమంత్రిగారి జులుం ఎలా ఉంటుందంటే కుక్కలు, చెప్పులు అంటూ శాపనార్థాలు, కవర్ చేసిన జర్నలిస్టులపై కేసులు, జైళ్ళు వంటి చిత్రవిచిత్ర తిక్క తుగ్లక్ విన్యాసాలు అన్నీ కూడా ఆవిష్కృతం చేయవచ్చు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు విజయశాంతి.

కూల్చివేతల సీఎం కేసీఆర్ ... ప్రజలకు ఆయన తీరుతో భయం
అంతేకాదు సీఎం కేసీఆర్ ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా కూల్చివేతలే చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. సెక్రటేరియట్ వెళ్లి చూస్తే కూల్చివేత, ప్రగతి భవన్ కు పంపిస్తే పక్క భవనాల కూల్చివేత, వరంగల్ కి వెళ్తే జైలు కూల్చివేత, ఇప్పుడు జిల్లాల లో ఏమేమి కూలుస్తాడో అని ప్రజలు భీతిల్లే పరిస్థితులు కూడా వినబడుతున్నాయి అని విజయశాంతి పేర్కొన్నారు. తాజాగా సీఎం కేసీఆర్ ఇచ్చిన వార్నింగ్ పై అబ్బే ఆయన చెప్పింది చేయడు అంటూ బిజెపి నాయకురాలు విజయశాంతి సెటైర్లు వేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications