కేసీఆర్ కు మోడీ భయం; అందుకే హోర్డింగ్స్ రాజకీయం: బీఆర్ఎస్ పైనా విరుచుకుపడ్డ విజయశాంతి
బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ, బిజెపి సీనియర్ నాయకురాలు విజయశాంతి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి వస్తుంటే సీఎం కేసీఆర్ కుటిల బుద్ధి బయట పెట్టుకుంటున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోడీ అంటే కేసీఆర్ కు ఇంత భయమా? విజయశాంతి
సీఎం కేసీఆర్ కుటిలబుద్ధి మరోసారి బయటపడింది. ప్రధాని మోడీ తెలంగాణకు వస్తుంటే తన పేరు ఎక్కడ వినబడకుండా పోతుందోనని కెసిఆర్ కు భయం పట్టుకుందని విజయశాంతి ఎద్దేవా చేశారు. అందుకే ప్రజాధనంతో నగరం మొత్తం హోర్డింగ్స్ట్టి పెట్టిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ సర్కార్ చేస్తున్నఈ చిల్లర రాజకీయాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని పేర్కొన్న విజయశాంతి మోడీగారంటే కేసీఆర్కి ఇంత భయమా? అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కెసిఆర్ హోర్డింగ్ ల రాజకీయాన్ని త్వరలోనే ఆయన ఫామ్ హౌస్ కు పంపిస్తాం
తాము ఎప్పుడో నైతికంగా విజయం సాధించామని ఎన్నికల్లో విజయం ఒక్కటే బాకీ ఉందని విజయశాంతి అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో అది కూడా చేసి చూపిస్తామని విజయశాంతి పేర్కొన్నారు. కెసిఆర్ హోర్డింగ్ ల రాజకీయాన్ని త్వరలోనే ఆయన ఫామ్ హౌస్ కు పంపిస్తామని విజయశాంతి పేర్కొన్నారు. ఇదే సమయంలో కాషాయదళాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ వేస్తున్న అడుగులు తప్పటడుగులు తప్ప ఇంకేంకాదనడానికి రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయమే పెద్ద ఉదాహరణ అని విజయశాంతి పేర్కొన్నారు.
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు కేసీఆర్ బీఆర్ఎస్
జాతీయస్థాయిలో కాంగ్రెస్సేతర... బీజేపీయేతర కూటమి అంటూ బీరాలు పలికిన ఈ పెద్ద మనిషి విపక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా కు మద్దతు పలకడం వెనుక ఆంతర్యం అందరికీ తెలుసని విజయశాంతి వ్యాఖ్యానించారు. తెలంగాణలోనే కాకుండా జాతీయస్థాయిలో సైతం బీజేపీని ఎలాగైనా అడ్డుకోవాలని... సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి.... అన్న సామెత గుర్తుకొస్తోంది అని విజయశాంతి ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఎంత కిందా మీదా పడినా ఆయన ప్రతిపాదించిన బీఆరెస్కి స్పందన వస్తే ఒట్టు అంటూ విజయశాంతికి జాతీయ పార్టీని ఎవరూ ఆదరించరని స్పష్టం చేశారు.
కేసీఆర్ బీఆర్ఎస్ కి.... టీఆరెస్కి ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయం
ఈ సయామీ ట్రిప్లెట్స్తో సహా కేసీఆర్ బీఆర్ఎస్ కి.... రాష్ట్రంలో దాని మాతృపార్టీ టీఆర్ఎస్ కి ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయం అంటూ విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్ళూ సయామీ ట్విన్స్గా ఉంటూ వచ్చిన టిఆర్ఎస్, ఎంఐఎంలకి కాంగ్రెస్ కూడా తోడై మూడు పార్టీలు కలసి సయామీ ట్రిప్లెట్స్ అవతారమెత్తాయి అని విజయశాంతి పేర్కొన్నారు. ఈ మూడు పార్టీలు తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడంలో పోటీపడుతున్నాయి అని మండిపడ్డారు. ఇలాంటి విషయాల్లో ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం ఎంతమాత్రం టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకి భిన్నంగా వ్యవహరించదని అందరికీ తెలిసిన విషయమేనని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు ఓట్ల కోసం పరస్పరం విమర్శించుకున్న టీఆర్ఎస్, ఎంఐఎంలు, తర్వాత ఎంత అన్యోన్యంగా ఉన్నాయో అందరూ చూస్తున్నారంటూ ఆయా పార్టీల తీరును ఎండగట్టారు.
కాంగ్రెస్, టిఆర్ఎస్ యువరాజులు ఇద్దరూ కలిశారు
కాంగ్రెస్తో కలిసిపోయేదే అన్నట్టుగా అసలు రంగు బయటపెట్టుకున్నారని విమర్శించారు . మరోవైపు కేసీఆర్ మేకపోతు గాంభీర్యానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ తీరు కూడా ఉందని విజయశాంతి పేర్కొన్నారు.తెలంగాణలో టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నానా విమర్శలూ చేసుకుంటున్నట్టు పైకి బిల్డప్పులిస్తుంటే... జాతీయ స్థాయిలో మాత్రం రాహుల్, సోనియాలు ఏమీ స్పందించరు అని పేర్కొన్న విజయశాంతి విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ దాఖలు సమయంలో కాంగ్రెస్, టిఆర్ఎస్ యువరాజులు రాహుల్, కేటీఆర్... ఇద్దరూ కలసికట్టుగా ఉల్లాసంగా కనిపించారు అంటూ మండిపడ్డారు.
Recommended Video
తమ గులాబీ రంగు ఎప్పటికైనా వెలిసిపోయేదే : కేసీఆర్ ను టార్గెట్ చేసిన విజయశాంతి
విపక్ష అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా ఎంపిక అనంతరం అయనకు మద్దతునిచ్చే విషయంలో ఏ నిర్ణయమూ వెంటనే చెప్పక... బీజేపీని అడ్డుకునే విషయంలో తాను నిజాయితీగానే ఉన్నట్టు నటించి... చివరికి ఆ కాంగ్రెస్ పార్టీ ఉన్న విపక్షకూటమి అభ్యర్థికే మద్దతు పలికిన తమ గులాబీ రంగు ఎప్పటికైనా వెలిసిపోయేదే అంటూ విజయశాంతి సీఎం కేసీఆర్ తీరును టార్గెట్ చేశారు. కెసిఆర్ కాంగ్రెస్ తో అంటకాగుతున్నారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ పట్ల భయంతోనే కేసీఆర్ ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారని విజయశాంతి విమర్శించారు.