ఇన్ఫోసిస్ క్యాంపస్ విస్తరణ: 25 వేలకు పెరుగనున్న ఉద్యోగులు (పిక్చర్స్)
హైదరాబాద్: భారతీయ దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ హైదరాబాదు సమీపంలోని పోచారంలో గల తన క్యాంపస్ను విస్తరించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ విశాల్ సిక్కా వెల్లడించారు. సోమవారం టీహబ్ భవనం క్యాటలిస్ట్లో రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెటి రామారావును కలిశారు.
ఈ సందర్భంగా పోచారంలో ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్ను విస్తరించనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాదిలోగా సుమారు 25 వేల మంది ఉద్యోగులు తమ పోచారం క్యాంపస్లో పనిచేస్తారని వివరించారు. విశాల్ సిక్కా ప్రతిపాదనపై మంత్రి కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫోసిస్కు పూర్తి సహాయ సహకారాన్ని అందిస్తుందని చెప్పారు. ఇన్ఫోసిస్ తమ క్యాంపస్ విస్తరణను ప్రకటించడం, ఐటీ పరిశ్రమను హైదరాబాద్ నలుమూలలా విస్తరించాలన్న తమ ప్రణాళికలకు ఊతం ఇస్తుందని హర్షం వ్యక్తం చేశారు.
టీ హబ్పై విశాల్ సిక్కా ప్రశంసలు
టీ హబ్పై విశాల్ సిక్కా ప్రశంసల జల్లు కురిపించారు. కాటలిస్ట్లోని విశిష్ఠ మౌలిక వసతుల పట్ల హర్షం వ్యక్తం చేశారు. అన్ని సౌకర్యాలున్న ఇలాంటి భారీ ఇంక్యుబేటర్ను ఇప్పటివరకు తాను చూడలేదని అన్నారు.
విశాల్ సిక్కా ఆకాంక్ష
తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్ల కోసం, ఆలోచనలను ప్రోత్సహించేందుకు చేపట్టిన ఇంక్యుబేటర్ కార్యక్రమం విజయవంతం కావాలని సిక్కా ఆకాంక్షించారు.
సిక్కా మరోసారి వస్తారు..
టీ హబ్లోని స్టార్టప్ కంపెనీలతో మాట్లాడేందుకు సిక్కా మరోసారి హైదరాబాద్ రానున్నారని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు.
ఇన్ఫోసిస్ ఆసక్తి
టీ హబ్లోని ఆవిష్కరణలకు, స్టార్టప్లకు నిధులు సమకూర్చేందుకు ఇన్ఫోసిస్ ఇన్నోవేషన్ ఫండ్ తరఫున ఆసక్తి చూపించారని కెటిఆర్ తెలిపారు.
త్వరలో ఐటీ పాలసీలు
ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ విశాల్ సిక్కాతో త్వరలోనే తమ ఐటీ పాలసీలను ఆవిష్కరించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు తమ ప్రతిపాదనను విశాల్ సిక్కాతో చెప్పగా ఆయన సంతోషంగా ముందుకువచ్చారని చెప్పారు.
చార్మినార్ జ్ఞాపిక
సమావేశంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, నాస్కాం సీఈవో బీవీఆర్ మోహన్రెడ్డి, టీ హబ్ సీఈవో జయ్ కృష్ణన్, టీ హబ్ సీఓఓ శ్రీనివాస్ కొల్లిపార, ఇన్ఫోసిస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ విశాల్ సిక్కాకు చార్మినార్ జ్ఞాపికను అందజేశారు.
సౌర విద్యుత్తు ప్లాంట్
పోచారంలోని తమ క్యాంపస్లో ఇన్ఫోసిస్ సంస్థ 6.6 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్లాంట్ను ఆవిష్కరించింది.
ఇంతకు ముందే...
ఇంతకుముందే ఇక్కడ రూఫ్టాప్పై 0.6 మెగావాట్ల సోలార్ ప్లాంట్ను ఇన్ఫోసిస్ సంస్థ ఏర్పాటు చేసింది.
ఇండియాలో మొదటిది..
భారతదేశంలో పూర్తిగా పునరుత్పాదక ఇంధనంపై ఆధారపడిన మొట్టమొదటి కార్పొరేట్ క్యాంపస్ తమదేనని ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఈ ప్లాంట్ వల్ల 9,200 టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గిపోగలవని పేర్కొంది.