Video: తొర్రూర్లో అమానుషం.. ఇద్దరు పిల్లలతో బలవంతంగా పేడ తినిపించారు..
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్లో దారుణం జరిగింది.మామిడి తోటలో పిందెలు తెంపారన్న కారణంగా ఇద్దరు బాలురపై కాపలాదారులు అత్యంత అమానవీయంగా వ్యవహరించారు. వారిపై దాడి చేయడంతో పాటు బలవంతంగా పేడ తినిపించారు. ఈ తతంగం మొత్తాన్ని సెల్ఫోన్లో వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ ఇద్దరు చిన్నారులు దళిత సామాజికవర్గానికి చెందిన బేడ బుడగ జంగాల పిల్లలుగా తెలుస్తోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది.
Recommended Video
అసలేం జరిగింది...
తొర్రూరు పట్టణానికి చెందిన ఇద్దరు పిల్లలు తాము పెంచుకుంటున్న కుక్క కనిపించడం లేదని అంతటా గాలించారు. ఈ క్రమంలో పట్టణ శివారులోని ఓ మామిడి తోట వద్దకు వెళ్లారు. ఆ సమయంలో తెలిసీ తెలియక ఓ చెట్టు పిందెలు తెంపారు. అంతే,దూరం నుంచి ఈ విషయాన్ని గమనించిన తోట కాపలాదారులు బానోతు యాకూబ్, బానోతు రాములు ఆ పిల్లల వెంట పడ్డారు. పరిగెత్తుతున్న ఆ ఇద్దరినీ పట్టుకుని తోటకు తీసుకొచ్చారు.
నోట్లో పేడను కుక్కారు...
ఆపై ఇద్దరినీ తాళ్లతో కట్టేశారు. కర్రతో,బరిగెలతో ఇద్దరు పిల్లలపై దాడి చేశారు. 'వద్దు తాతా... కాళ్లు మొక్కుతా... దణ్ణం పెడుతా...' అంటూ ఆ చిన్నారులు ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదు. పైగా పేడ తింటే వదిలిపెడుతామని అన్నారు. బలవంతంగా ఇద్దరు పిల్లల నోళ్లలో పేడను కుక్కారు. పేడ బాగుందా అంటూ వెటకారమాడారు.బరిగెలతో మరోసారి ఇద్దరినీ చితకబాదారు. ఈ మొత్తం తతంగాన్ని ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆ ఇద్దరి అరెస్ట్...
ఈ ఘటనపై బాధిత పిల్లల తల్లిదండ్రులు తొర్రూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు కొంతమంది దీన్ని కలెక్టర్,ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పిల్లలపై దాడికి పాల్పడిన బొత్తల తండాకు చెందిన బానోత్ యాకు,హచ్చుతండాకు చెందిన బానోతు రాములును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నగేశ్ తెలిపారు. గతంలో ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం సింగంపల్లిలోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మామిడి తోటలో ఒక చెట్టు పండు కోశాడన్న కారణంతో దళిత యువకుడు బక్కి శ్రీను(32)ను గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉరివేశారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది.